📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

చేపల కూరలు

పులస చేప

Hot pot Rajahmundry - Community | Facebook

పులస చేపలు మార్కెట్లో దొరకడమే కష్టం. కనిపిస్తే కొనకుండా ఎవరూ వదలరు. వాటిని ఎలా వండితే మంచి రుచిగా వస్తాయో చూద్దాం


కావాల్సిన పదార్థాలు


పులసచేప – ఒక కేజీ, ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, పచ్చిమిర్చి – అయిదు, చింతపండు గుజ్జు – అరకప్పు, టమాటా గుజ్జు – ఒక కప్పు, కరివేపాకు – గుప్పెడు, ధనియాల పొడి – రెండు టీ స్పూనులు, జీలకర్ర – అరటీస్పూను, మెంతిపొడి – పావు టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, కారం – ఒక టీస్పూను, నూనె – తగినంత, పసుపు – పావు టీస్పూను, కొత్తిమీర తరుగు – మూడు టీస్పూనులు

తయారు చేసే విధానం

చేప ముక్కలు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని సన్నగా తరగాలి. పచ్చిమిర్చి నిలువుగా కోయాలి. ఇప్పుడు స్టవ్ పై కిలో చేపల కూర ఉడికేంత పెద్ద కళాయి పెట్టి…. అందులో నూనె వేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక అందులో టమాటా గుజ్జు వేసి కలపాలి. అందులో చింతపండు పులుసు, కారం, పసుపు కూడా వేసి బాగా వేయించాలి. అందులో రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టాలి. ఓ పదినిమిషాల తరువాత అందులో చేప ముక్కలు వేసి చిన్న మంటపై ఉడికించాలి. ఓ పదినిమిషాల తరువాత ధనియాల పొడి, మెంతిపొడి, కరివేపాకు, కారం వేసి ఓసారి కలిపి ఉడికించాలి. ఓ 20 నిమిషాల తరువాత చేప ఉడికిందో లేదో చూడాలి. పులుసు చిక్కగా అయ్యాక పైన కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే పులస పులుసు తయార్.

గోదావరి చేపల పులుసు

కావల్సినవి: కొరమీను చేప – కేజీ (మీడియమ్‌ సైజులో ముక్కలు చేయాలి); చింతపండు – 150 గ్రా.లు (నీళ్లలో నానబెట్టి రసం తీయాలి); టొమాటోలు – పావుకేజీ (ముక్కలుగా కట్‌ చేయాలి); ఉల్లిపాయలు – పావుకేజీ (సన్నగా తరగాలి); పచ్చిమిర్చి – 5 (నిలువుగా చీరాలి); మెంతులు – 2 టీ స్పూన్లు; ఆవాలు – టీ స్పూన్‌; కారం – తగినంత; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; ఎండుకొబ్బరి – 2 టీ స్పూన్లు; కొత్తిమీర – కొద్దిగా; నూనె – తగినంత.
తయారీ: ∙వెడల్పాటి పాన్‌లో నూనె వేసి కాగాక మెంతులు, ఆవాలు వేయించి ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి కలపాలి. అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ వేగాక సరిపడా కారం, చింతపులుసు, ఉప్పు కలిపి ఉడికించాలి ∙రసం చిక్కబడ్డాక చేప ముక్కలు వేసి మూత పెట్టాలి ∙5 నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి దించాలి lగరిటెతో కలిపితే ముక్కలు విరిగిపోతాయి కనుక జాగ్రత్తగా తీసుకోవాలి.

మునక్కాయ చేపల కూర
కావలసినవి: కొరమీను చేప ముక్కలు – అరకేజీ; కారం – నాలుగు టీ స్పూన్లు; ధనియాల పొడి – రెండు టీ స్పూన్లు; చింతపండు గుజ్జు – అర కప్పు; కొబ్బరి పేస్ట్‌ – అర కప్పు; పచ్చిమిర్చి – 10 (కచ్చాపచ్చాగ దంచాలి); మునక్కాయలు – 2 (చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి); నూనె – అర కప్పు,; జీలకర్ర పొడి – టీ స్పూన్‌; ఎండుమిర్చి – 5, కరివేపాకు – రెమ్మ; పసుపు – అర టీ స్పూన్‌; ఉప్పు – తగినంత.

తయారీ:
►చేపముక్కలను శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి
►స్టౌ మీద పాన్‌ పెట్టి రెండు టీ స్పూన్ల నూనె వేసి వేడెక్కాక అందులో కొబ్బరి పేస్ట్, పచ్చిమిర్చి, ధనియాలపొడి, కారం, పసుపు తగినంత ఉప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి
►తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టాలి
►ఈ మిశ్రమం కాస్త చిక్కపడ్డాక అందులో కట్‌ చేసిన మునక్కాయ ముక్కలు, చింతపండు గుజ్జు పోసి సన్నటి సెగ మీద ఉంచాలి
►ఇది ఉడుకుతుండగా మధ్యలో చేప ముక్కలను కూడా జత చేసి మూతపెట్టాలి
►ఈ మిశ్రమమంతా చిక్కబడుతుండగా దించి వేరొక పాన్‌లో మిగిలిన నూనె వేయాలి
►అది వేడెక్కాక అందులో జీలకర్రపొడి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టాలి
►వేయించిన తాలింపును ఉడికించిన కూరలో కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.


ఫిష్‌ బిర్యానీ

కావల్సినవి: చేపముక్కలు – అర కేజీ; అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – టీ స్పూన్‌; కారం – అర టీ స్పూన్‌; బిర్యానీ మసాలా/ గరం మసాలా – అర టీ స్పూన్‌; పసుపు – కొద్దిగ; నిమ్మరసం – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌; ఉప్పు – తగినంత; టొమాటొ – 1; ఇతర పదార్థాలు; బిర్యానీ ఆకు – 1 ; బిర్యానీ పువ్వు – 2 ; దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 6; పచ్చ యాలకులు – 3; సాజీరా – అర టీ స్పూన్‌.
గ్రేవీ కోసం: నూనె – 3 టేబుల్‌ స్పూన్లు; ఉల్లిపాయల స్లైసులు – కప్పు; అల్లం –వెల్లుల్లి పేస్ట్‌ – ఒకటిన్నర కప్పు; గరం మసాలా పొడి – టీ స్పూన్‌; ధనియాల పొడి – అర టీ స్పూన్‌; కారం – అర టీ స్పూన్‌; పెరుగు – కప్పు; పుదీనా తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; కుంకుమపువ్వు – తగినంత; పాలు – 2 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత; 
బిర్యానీ రైస్‌: బాస్మతి బియ్యం – 1 1/2 కప్పు; ఉప్పు – తగినంత; నూనె – 1 టీ స్పూన్‌.
తయారీ: ∙చేపలు కాకుండా మిగతా పదార్థాలన్నీ ఒక పాత్రలో వేసి కలిపి పక్కన ఉంచాలి. ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్‌ చేసుకోవాలి. దీంట్లో చేప ముక్కలు వేసి కలపాలి ∙విడిగా గోరువెచ్చని పాలలో కుంకమపువ్వు వేసి కలిపి పక్కనుంచాలి ∙బాస్మతి బియ్యం కడిగి అరగంట నీళ్లలో నానబెట్టాలి. తర్వాత జల్లెడలో పోసి వడకట్టాలి ∙ఒక గిన్నెలో 6 కప్పుల నీళ్లు పోసి టీ స్పూన్‌ నూనె, ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టి మరిగించాలి ∙వడకట్టిన బియ్యం మరుగుతున్న నీళ్లలో వేసి ఉడికించాలి. అయితే, ఆఫ్‌ బాయిల్‌ కాగానే వడకట్టి పక్కనుంచాలి. మరొక గిన్నెలో కొద్దిగా నూనె వేసి చేప ముక్కలను రెండు వైపులా బంగారు రంగు వచ్చేలా వేయించి తీయాలి ∙దాంట్లోనే మరికొద్దిగ నూనె వేసి ఉల్లిపాయల తరుగు వేసి వేయించాలి. ∙దాంట్లోనే మిగతా అన్ని దినుసులు వేసి కొద్దిగా వేయించాలి ∙అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించాక టొమాటో ముక్కలు ఉడికించాలి. గరం మసాలా, ధనియాలపొడి, కారం వేసి వేగాక పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమం చిక్కబడేలా ఉడికించాలి.  ∙ఒక మందపాటి పెద్ద గిన్నెలో అడుగున కొద్దిగా గ్రేవీని ఒక లేయర్‌గా వేయాలి. దాని మీద సగం ఉడికిన అన్నాన్ని మరొక లేయర్‌గా వేసి ఆ పైన పుదీనా, కొత్తిమీర చల్లాలి. ఆ పైన వేయించిన చేప ముక్కలు కొన్ని ఉంచాలి. వాటి మీదుగా మళ్లీ అన్నం.. దాని మీద కొత్తిమీర–పుదీన– ఉల్లిపాయలు, కుంకుమపువ్వు పాలు.. ఆ పైన మళ్లీ చేప ముక్కలు.. ఆ పైన అన్నం.. ఇలా అన్ని లేయర్లు పూర్తి చేయాలి. 
►గిన్నె పైన మందపాటి మూత పెట్టి గోధుమపిండి ముద్దతో సీల్‌ చేయాలి. మంట పెంచి 2 నిమిషాలు ఆ తర్వాత మంట బాగా తగ్గించి 10 నుంచి 15 నిముషాలు ఉంచాలి ∙మంట ఆర్పేసి మరో పది నిమిషాలు ఉంచి మూత తీయాలి. వడ్డించడానికి ఫిష్‌ బిర్యానీ రెడీ. సన్నని స్లైసులుగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పెరుగు లేదా రైతాతో వడ్డించాలి.


చేప కుర్మా.

చేప కుర్మా... ఇలా చేయాలి!
చేప ముక్కలతో స్పైసీగా కుర్మా కూడా చేసుకోవచ్చు. అయితే అన్ని చేపలతో ఈ వంటకం బాగోదు. కనుక చేపల్లో బొచ్చెలు ఈ కూరకి సరైనవి.

కావాల్సిన పదార్థాలు

బొచ్చె చేప ముక్కలు – అయిదు, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, టమాటా ముక్కలు – పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు టీ స్పూనులు, పచ్చి మిర్చి – అయిదు, కరివేపాకులు – గుప్పెడు, ధనియాల పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి – చెరో పొడి అర చెంచా చొప్పున, గరం మసాలా పొడి – ఒక టీస్పూను, చింత పండు రసం – పావు కప్పు, కొత్తి మీర – ఒక కట్ట, ఉప్పు – తగినంత, నూనె – సరిపడినంత.

Google ad
తయారు చేసే విధానం

చేపముక్కలు కడిగి పసుపు, కారం,అరచెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి కలిపి అరగంట పాటూ పక్కన పెట్టాలి. ఇప్పుడు కళాయిలో కాస్త నూనె వేసి చేప ముక్కల్ని బాగా వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టాలి. బాణలిలో మరికొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర, కారం, టమాటా ముక్కలు వేసి బాగా ఉడకబెట్టాలి. అందులో రెండు కప్పుల నీళ్లు వేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉడికించాలి. ఆ సమయంలో చింతపండు రసం కూడా వేసేయాలి. నీళ్లు తగ్గి ఇగురులా అవుతున్నప్పుడు ముందుగా వేయించిన చేపల్ని అందులో వేయాలి. చేపముక్కలకి ఇగురు అంటేలా ఒక్కో ముక్కని కలపాలి. పైన కాస్త మెంతి పొడి, మసాలా చల్లి మళ్లీ కలపాలి. దించేముందు కొత్తి మీర చల్లాలి. వేడివేడి చేపల కుర్మా తినడానికి రెడీ అయినట్టే.

చేప మసాలా ఫ్రై

వావ్ అనిపించేలా చేప మసాలా ఫ్రై!
చేప ముక్కలుగా కోసి ఫ్రై ఇంట్లో చేసుకుంటూ ఉంటాం. రెస్టారెంట్ లలో మీడియం సైజులో ఉన్న చేప మొత్తాన్ని మసాలా పెట్టి వేయిస్తారు. చూడగానే నోరూరేలా ఉంటుంది ఆ డిష్. చేప మసాలా ఫ్రై చేయడం చాలా సులువు

కావాల్సిన పదార్థాలు
లావుగా ఉండే చేపకన్నా బల్లపరుపుగా ఉండే చేపలు ఇలాంటి ఫ్రైకు పనికొస్తాయి. చందువా చేపైతే ఇంకా బాగుంటుంది.
చేప – ఒకటి, ఎండుమిర్చి – నాలుగు, లవంగాలు – మూడు, దాల్చిన చెక్క – రెండు (చిన్నవి), యాలకులు – అయిదు, జీలకర్ర – పావు చెంచా, మిరియాలు – పావు చెంచా, అల్లం తరుగు – ఒక చెంచా, వెల్లుల్లి రెబ్బలు – అయిదు, ఉల్లిపాయ – ఒకటి, ఉప్పు సరిపడినంత, నూనె – సరిపడినంత, వెనిగర్ – టీ స్పూను

తయారు చేయు విధానం:


లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చిలను కొంచెం నీటిలో నానబెట్టాలి. అల్లం,వెల్లుల్లి ముక్కల్ని మాత్రం వెనిగర్‌లో నానబెట్టాలి. అనంతరం వాటిన్నింటినీ మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని చిన్నగా తరగాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి ఉల్లిపాయ తరుగును వేపాలి. స్టవ్ కట్టేసి వేపిన ఆ ఉల్లి తరుగును ముందుగా మిక్సీ చేసిన పెట్టుకున్న మసాలా ముద్దలో కలిపాలి. ఇప్పుడు శుభ్రం చేసిన చేపను తీసుకుంది. రెండు వైపులా కత్తితో గాట్లు పెట్టాలి. అలా అని చేప ముక్కలుగా విడిపోకూడదు. ఇప్పుడు సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లి మసాలా ముద్దని చేపపై పెట్టిన గాట్లలో కూరాలి. అనంతరం నిమ్మరసం, ఉప్పు సరిపడా చేపకు పట్టించాలి. దానిని ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచి మారినేషన్ చేయాలి. ఇప్పుడు పెనంపై నూనె వేసి చేపని రెండు వైపులా బాగా కాల్చాలి. గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేయించాక స్టవ్ కట్టేయాలి. ఆ చేప మసాలా ఫ్రై సిద్ధమైనట్టే.

చేపల వేపుడు

కావల్సినవి: చేప ముక్కలు – 6; కారం – అర టీ స్పూన్‌; మొక్కజొన్న పిండి – టీ స్పూన్‌; ఉప్పు – తగినంత; నిమ్మరసం – అర టీ స్పూన్‌; గుడ్డు – 1; ఉల్లిపాయలు – 1 (సన్నగా తరగాలి); నూనె – తగినంత; ధనియాల పొడి – టీ స్పూన్‌; గరం మసాలా – అర టీ స్పూన్‌; అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ – టీ స్పూన్‌; జీలకర్ర – అర టీ స్పూన్‌; కొత్తి మీర – టీ స్పూన్‌.
తయారీ: ∙గిన్నెలో చేప ముక్కలు వేసి కారం, మొక్కజొన్నపిండి, ఉప్పు, నిమ్మరసం, గుడ్డు, ధనియాల పొడి, అర టీ స్పూన్‌ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నిమ్మరసం వేసి కలిపి అరగంట పక్క నుంచాలి ►కడాయిలో నూనె వేసి కాగాక జీలకర్ర, ఉల్లిపాయలు వేయించాలి.
►అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కరివేపాకు వేసి కలిపి తర్వాత చేప ముక్కలు వేసి వేయించాలి 
►తర్వాత కొత్తి మీర చల్లి దించాలి.

కరకరలాడే… బటర్ ఫిష్ ఫ్రై

కరకరలాడే... బటర్ ఫిష్ ఫ్రై
కరకరలాడే స్పైసీ చేపల వేపుడును చాలా సులువుగా చేసుకోవడమెలాగో తెలుసుకోండి. వేపుడుకు ఉపయోగపడే చేపల్నే ఎంచుకోవాలి.

కావల్సినవి: చేప ముక్కలు – ఒక కిలో, మైదా – రెండు టీస్పూన్లు, కార్న్ ఫ్లోర్ – రెండు టీస్పూన్లు, వెన్న – మూడు టీ స్పూనులు, బేకింగ్ పౌడర్ – ఒక టీస్పూను, వెల్లుల్లి తురుము – రెండు టీ స్పూనులు, కొతిమీర తురుము – రెండు టీ స్పూనులు, ఉప్పు – సరిపడా

తయారీ : మైదా, కార్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్, వెల్లుల్లి తురుము, ఉప్పు కలపాలి. దానిలో కాస్త నీళ్లుపోసి కలపాలి. మిశ్రమం జారేలా అయ్యేలా మరికొంచెం నీళ్లు వేయాలి. ఇప్పుడు శుభ్రం చేసిన చేపముక్కల్ని ఈ మిశ్రమంలో ముంచి అరగంట పాటూ పక్కన పెట్టుకోవాలి. తరువాత పాన్లో వెన్న వేసి, అది వేడెక్కాక అందులో చేపముక్కలు వేయాలి. ముక్కలు ఎర్ర రంగులోకి వచ్చే వరకూ వేయించాలి. వాటిని ఒక ప్లేటు లోకి తీసుకుని, కొత్తిమీర చల్లి సర్వ్ చేస్తే సరి.
ఫిష్ ఫ్రైడ్ రైస్

సులువుగా... ఫిష్ ఫ్రైడ్ రైస్
బిర్యానీ వండటానికి చాలా సమయం పడుతుంది. అంత టైం మా దగ్గర లేదు అనుకునే వాళ్లు ఈ ఫిష్ ఫ్రైడ్ రైస్ ని తయారుచేసుకోవచ్చు.

కావల్సినవి : ముల్లు తీసేసిన చేప ముక్కలు – అరకిలో, వండిన అన్నం – మూడు కప్పులు, ఉల్లిపాయలు – మూడు, చిల్లీ సాస్ – రెండు టీ స్పూనులు, సోయా సాస్ – రెండు టీ స్పూనులు, పెప్పర్ పౌడర్ – ఒక టీస్పూను, కార్న్ స్టార్చ్ – ఒక టీ స్పూను, సన్నగా తరిగిన క్యాప్సికం – ఒక కప్పు, కొత్తిమీర – ఒక కప్పు, తురిమిన అల్లం – ఒక టీ స్పూను, నూనె – సరిపడినంత, ఉప్పు – తగినంత

తయారీ: చేప ముక్కలని నచ్చిన పరిమాణంలో కోయాలి. వాటిని నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. వాటికి తడి పెద్దగా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు చిల్లీ సాస్, సోయా సాస్, పెప్పర్ పొడి ముక్కలకి బాగా అంటేలా కలిపి పావుగంట పాటూ ఉంచాలి. సరిపడినంత ఉప్పు వేసి అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. చేపముక్కలపై కాస్త కార్న్ స్ట్రార్చ్ పొడి కూడా వేయాలి. పాన్‌లో నూనె వేసి వేడెక్కాక, అందులో చేపముక్కల్ని ఎర్రగా వేపాలి. వాటిని తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో మళ్లీ నూనె వేసి అల్లం వెల్లుల్లి తరుగు‌ని వేపాలి. అందులో నిలువుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, క్యాప్సికమ్ వేసి బాగా వేపాలి. ముందుగా వేపి పెట్టుకున్న చేపలు కూడా వేసి మళ్లీ ఫ్రై చేయాలి. ఇప్పుడు వండిన అన్నాన్ని చేప ముక్కల మిశ్రమంలో వేసి జాగ్రత్తగా కలపాలి. అంతే ఫిష్ ఫ్రైడ్ రైస్ సిద్ధం.

అమృత్‌సర్‌ మచ్చి

కావల్సినవి: వంజరం చేప గుండ్రటి ముక్కలు – 600 గ్రా.లు; శనగపిండి – కప్పు; కారం – టేబుల్‌ స్పూన్‌; వాము (ఓమ) – టీ స్పూన్‌; అల్లం ముద్ద – 2 టేబుల్‌ స్పూన్లు; వెల్లుల్లి ముద్ద – 2 టేబుల్‌ స్పూన్లు; నిమ్మరం – టేబుల్‌ స్పూన్‌; నూనె – వేయించడానికి తగినంత; గుడ్డు – 1; చాట్‌ మసాలా – టీ స్పూన్‌ ; నిమ్మ ముక్కలు (చక్రాల్లా కోసినవి) – 2.
తయారీ: ∙బాగా కడిగిన చేప ముక్కలు ఒక గిన్నెలో వేసి, అందులో కారం, ఉప్పు, వాము, అల్లం, వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, శనగపిండి వేసి కలిపి పక్కనుంచాలి. కడాయిలో నూనె పోసి కాగనివ్వాలి ∙మరొక గిన్నెలో గుడ్డు సొన వేసి, కలిపి, చేప ముక్కలను అందులో ముంచి కాగిన నూనెలో వేసి రెండువైపులా గోధుమరంగులోకి మారేంతవరకు వేయించుకోవాలి ∙పేపర్‌నాపికిన్‌ (అబ్‌సార్బెంట్‌ పేపర్‌) మీద వేయించుకున్న ముక్కలు వేయాలి. ఇలా చేస్తే అదనపు నూనె పేపర్‌ పీల్చుకుంటుంది. వడ్డించే ముందు వీటిని మరోసారి వేయించి, వెంటనే అందిస్తే  చేప ముక్కలు కరకరలాడుతూ బాగుంటాయి ∙చేప ముక్కలను వేసే ప్లేట్‌ అడుగున అబ్‌సార్బెంట్‌ పేపర్‌ వేసి, ముక్కల పైన చాట్‌ మసాలా చల్లి, కట్‌ చేసుకున్న నిమ్మముక్కలతో అలంకరించాలి.


చేప ఆవకాయ

కావల్సినవి: ఆవకాయ – 100 గ్రా.లు; చేప ముక్కలు (ముల్లు తీసినవి) – 200 గ్రా.లు; నూనె – వేయించడానికి తగినంత; మైదా – కప్పు; మొక్కజొన్న పిండి – కప్పు; ఉప్పు – తగినంత; కారం – టీ స్పూన్‌; మిరియాల పొడి – టీ స్పూన్‌; కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు; పచ్చిమిర్చి – 4; అల్లం–వెల్లుల్లి ముద్ద– టీ స్పూన్‌; అల్లం–వెలుల్లి తరుగు– 2 టేబుల్‌ స్పూన్లు; గుడ్డు – 1; ఉల్లిపాయ – 1 (సన్నగా తరగాలి).
తయారీ: ∙ముందుగా చేపలను శుభ్రం చేసి, ఒక గిన్నెలో వేసి అందులో గుడ్డు సొన, ఉప్పు, మిరియాలపొడి, కారం, అల్లం–వెల్లుల్లి ముద్ద, మైదా, మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి.
►కడాయిలో నూనె పోసి కాగాక ఈ చేప ముక్కలను పకోడీల మాదిరి వేయించి తీసి పక్కన పెట్టాలి ∙తరువాత మరో కడాయిలో 2 టేబుల్‌ స్పూన్ల నూనె వేసి అల్లం–వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవకాయ వేసి కలపాలి 
►దీంట్లో వేయించిన చేప ముక్కలను వేసి బాగా కలపాలి. తరువాత కొత్తిమీర తరుగు చల్లి సర్వ్‌ చేయాలి.

Advertisement
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading