📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

సరోజినీ నాయుడు

Google ad
sarojini naidu

సరోజినీ నాయుడు భారత కోకిలగా ప్రసిద్ధి చెందారు. (నైటింగేల్ ఆఫ్ ఇండియా ) సరోజినీ నాయుడు స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి కూడా. ఈమె క్రీ.శ. 1879 వ సంవత్సరం ఫిబ్రవరి 13 వ తేదీన హైదరాబాద్లో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి డా.అఘోరనాథ్ చటోపాద్యాయా, తల్లి శ్రీమతి వరద సుందరి. అఘోరనాథ్ చటోపాథ్యాయగారు హైదరాబాదు కాలేజికి, (నేటి నిజాం కాలేజీ) మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసారు. తల్లి వరదాదేవి చక్కని రచయిత్రి. చిన్నతనం నుంచీ ఆమె బెంగాలీ భాషలో చక్కని కావ్యాలు, కథలు వ్రాయడం జరిగింది.

తండ్రి గారైన అఘోరనాథ్ చటోపాధ్యాయ ఎనిమిది భాషలలో పండితుడు. సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, గ్రీకు, జర్మనీ, హిబ్రూ, ఫ్రెంచ్, ఆంగ్లం మొదలైన భాషలు ఆయనకు అనర్గళంగా వచ్చు. ఇతను ఎడింబరో విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరు పట్టాను పొందారు.

Google ad

శ్రీమతి సరోజినీ నాయుడు తల్లి దండ్రులు విద్యాధికులవటం వలన, ఆమెలో చిన్నతనం నుంచే కార్యదీక్షా, పట్టుదలా, విద్యపై తిరుగులేని సదభిప్రాయాలు ఏర్పడటం జరిగింది. బాల్యం నుంచి ప్రతి విషయం లోనూ కుతూహలం కనబరచి ఏది, ఏమిటో వివరాలు తెలుసుకొనే వరకూ విశ్రమించరు కొందరు. ఈ కోవకు చెందిన మేధావి శ్రీమతి సరోజినీ నాయుడు.

Google ad

ఈ దేశం బానిస తనం నుంచీ, నియంతృత్వ సంకెళ్ళ నుంచీ విముక్తి పొంది నాది, నేను అన్న భావంతో అఖిల భారత ప్రజానీకం స్వేచ్ఛా, స్వాత్రంత్ర్యాలతో జీవించాలన్నదే సరోజినీ నాయుడు మహత్తర ఆశయం. భారతదేశంలో పురుషులే కాక, భారత మహిళలు ఏ రంగంలోనూ, తీసిపోరని నిరూపించిన వీర మహిళలు మన దేశంలో చాలా మంది పుట్టారు. అటువంటి వారిలో శ్రీమతి సరోజినీ నాయుడు కూడా ఒకరు.సరోజిని నాయుడు మంచి రచయిత్రి. పద్య రచయిత. చిన్నతనం నుంచీ ఆమెకు ఇంగ్లీషు భాషమీద చాలా ఇష్టం ఉండేది. ఇంగ్లీషు మాట్లాడాలని ఆమె ఎంతగానో ప్రయత్నిస్తూండేది. ఆ పట్టుదలా, ధ్యేయాలతోనే ఇంగ్లీషు భాషను ఎంతో శ్రద్ధగా అభ్యసించింది. పదకొండో సంవత్సరం వచ్చేసరికి ఆమె అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఆ వయసులోనే ఇంగ్లీషులో రచనలు ఆరంభించింది సరోజిని నాయుడు.

Google ad
Google ad

పన్నెండవ ఏట మదరాసు విశ్వవిద్యాలయంలో మెట్రిక్ లేషన్ పూర్తి చేయగలిగిందంటే ఆమె చురుకైన తెలివితేటలూ, విద్య యందు ఆమెకు గల శ్రద్ధ మనం అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ కు దగ్గరలోని వీరి ఇంటిని సరోజినీ నాయుడుగారి తదనంతరం తమ ప్రసిద్ధ కవితా సంకలనమైన గోల్డన్ త్రెషోల్డ్ గా పేరు మార్చటం జరుగుతుంది. ప్రస్తుతం ఇది హైదరాబాద్ యూనివర్శిటిగా రూపొందింది.

సరోజినీ పదమూడవ యేట చాలా పెద్ద రచన రచించింది. దానిపేరు సరోవరరాణి (Lady of Lake). అది పదమూడు వందల పంక్తులతో నిండిన అతి చక్కని రచన. తాను చెప్పదలచుకున్న విషయము ఇతరుల హృదయాలకు హత్తుకుని ఆలోచింపజేసే విధంగా చక్కటి శైలిలో ఉండేవి. చిన్న తనం నాడె రచనలు ప్రారంభించిన ఆమెలోని ప్రత్యేకతలు గ్రహించిన నిజాంనవాబు ఆమె యందు గల అభిమానంతో ఆమెను విదేశాలకు పంపాలని నిర్ణయించుకుని, ఆమె వివిధ శాస్త్రాలలో పరిశోధన చేసేందుకు ప్రోత్సాహమిస్తూ ఆమెకు ప్రతి సంవత్సరం నాలుగువేల రెండు వందల రూపాయలు విద్యార్థి వేతనంగా ఇచ్చేందుకు కూడా అంగీకరించాడు. నిజాం నవాబు ప్రోత్సాహం దొరికేసరికి, ఆమెకు చదువుమీదనున్న ఆసక్తి గ్రహించిన తల్లి దండ్రులు ఆమెను విదేశాలకు పంపారు. సరోజినీ లండన్ లోని కింగ్స్ కాలేజీ లోను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ అధ్వర్యంలోని గిర్టన్ కాలేజిలోనూ విద్యాధ్యయనం చేసింది. ఈవిడ రాసిన కవితలను చదివి, ఇంగ్లాండ్ లోని ఆంగ్లభాషా విమర్శకులు ‘ఆర్థర్ సైమన్స్’, ఎడ్వర్ గూస్ లు అభినందించారు. పాశ్చాత్య విద్వాంసులను చాలా మందిని కలసి వారికి గల పాండిత్యాన్ని ఆకళింపు చేసుకుని వారితో స్నేహసంబంధాలు పెంచుకుని వారి సలహాలపై, ఇంగ్లీషులో అతి చక్కని గ్రంథాలు వ్రాసింది. ఆమె రచించిన కావ్యాలలో “కాలవిహంగం” (Bird of time), “స్వర్గ ద్వారం” (The Golden Threshold), విరిగిన రెక్కలు (The Broken Wings) అనేవి చాలా ప్రసిద్ధమైనవి. ఆమె ఇంగ్లాండులో నివసిస్తూ రచనలు సాగించినా వాటిలో భారతీయ జీవితాలు మన జాతి ప్రత్యేకతలు కనబడేవి. 1898 వ సంవత్సరం విదేశాలలో విద్య పూర్తి చేసుకుని భారతదేశం తిరిగి వచ్చాక, శ్రీ ముత్యాల గోవిందరాజులు నాయుడు గారితో పెండ్లి జరుగుతంది. ముత్యాల గోవిందరాజులు నాయుడు అప్పటి హైదరాబాద్ ఆరోగ్యవిభాగంలో అధికారి.

కులం మతం అనె మూఢవిశ్వాసాలంటే శ్రీమతి సరోజినీ నాయుడికి చిన్నతనం నుంచే ఏవగింపు. ఈ కుల, మతం ఏకమై జాతి జీవనాన్ని ఛిద్రంచేస్తూ, వర్గ భేదాన్ని సృష్టించి ధనవంతులు, నిరుపేదలు, బలవంతులు, బలహీనులనే వేర్పాటు ధోరణికి బలి చేస్తుందనీ, కుల మతాతీత భావాలతో పెరిగే ప్రజానీకం మాత్రమే సమాజ స్థాపన చెయ్యగలరనీ ఆమె అభిప్రాయం. ఆమె అదే అభిప్రాయంతో శ్రీ ముత్యాల గోవిందరాజులు నాయుడు తన కులానికి చెందిన వ్యక్తి కాకపోయినా భారతీయ మహిళా లోకానికి ఆదర్శం కావాలన్న అభిప్రాయంతో ఆనాడే వర్ణాంతర వివాహం చేసుకుంది. ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు వీరి వివాహం జరిపించారు. ఈ పనికి ఎన్నో విమర్శలు ఎదుర్కోవలసి వచ్చినా మానవ జీవిత మనుగడకు మనసూ, మానవతా ముఖ్యం కాని, అర్థం లేని గ్రుడ్డి నమ్మకాలను ప్రోత్సహించి జాతిని పతనము చేసే కులము కాదని ఆమె నిరూపించగలిగింది. తనూ, తన భర్త, ఆచార వ్యవహారాలు భిన్నమైన కులాలు వేరైనా మనసున్న మనుషులుగా సంస్కార వంతులుగా నియమబద్దమైన జీవితం సాగించసాగారు. స్త్రీ పురుషులు ఒకరినొకరు అర్థం చేసుకుని సంసారము దిద్దుకోగలిగితే కులము గొడవ ఏదీ లేదని మిగిలిన సమాజానికి నిరూపించారు. శ్రీమతి సరోజినీ నాయుడు గోవిందరాజులు నాయుడు గార్ల దాంపత్య చిహ్నంగా వారికి ఒక కుమారుడూ, ఇద్దరు కుమార్తెలు కలిగారు. కుమారుడు ముత్యాల జయసూర్య నాయుడు ప్రముఖ హోమియోపతీవైద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు మరియు హైదరాబాదుకు చెందిన రాజకీయ నాయకుడు. వీరి కుమార్తెలలో ఒకరైన పద్మజా నాయుడు బెంగాల్ గవర్నర్ గా పనిచేశారు.

వివాహమై బిడ్డలు పుట్టినా, ఆమె కేవలం తన సంతోషం తన పిల్లల సుఖం గురించి ఆలోచించలేదు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ ఆ రోజులలో గోపాల కృష్ణ గోఖలే నాయకత్వంలో ఉద్యమాలు సాగిస్తోంది. వీరు మహిళాభివృద్దికి ఎంతో కృషిచేసి 1906లో మహిళలకు విద్య అవసరమని దేశమంతా ఎన్నో మహిళా సమావేశాలు ఏర్పరచి మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో పాటు పడ్డారు. స్వాతంత్ర్య సాధనలో తనూ పాలుపంచుకోవాలని ఆలోచించిన శ్రీమతి సరోజినీ నాయుడు కాంగ్రెస్ జాతీయ భావాలకు అనుగుణంగా నడుచుకోనారంభించింది. 1915 వ సంవత్సరం బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో, 1916 లో జరిగిన లక్నో కాంగ్రెస్ సభలలో ఆమె పాల్గొనటం జరిగింది. ఆనాటి కాంగ్రెస్ భావాలు చాలా ఆదర్శంగా ఉండేవి. సరోజినీనాయుడు భారత దేశములో గల ముఖ్యమైన, నగర, పట్టణాలు తిరుగుతూ స్వాతంత్ర్యోద్యమ ఉపన్యాసాలిచ్చి, ప్రజలతో భాష విప్లవము వచ్చేందుకు కారకురాలయినది. మృదువుగా మాట్లాడుతూ, ఎంత కఠినమైన విషయాలైనా, శ్రోతల గుండెలను హత్తుకుని మరుగున ఉన్న యదార్థ స్థితిని అర్థమయ్యే విధంగా ఆమె గంభీరమైన ఉపన్యాసం విన్న శ్రోతలకు కాలం, శ్రమ తెలిసేవి కాదు. ఆమె ఉపన్యాసాలు దేశభక్తిని నూరి పోసి చావుకు కూడా భయపడని తెగింపును తేగలిగాయి. “జాతి వేరనీ, దేశం వేరనీ, నువ్వు వేరనీ విడిగా ఉండకు, నీకు జరిగితే దేశానికి జరిగినట్టే, దేశం అనుభవించే బానిసతనం నీవూ అనుభవించవలసినదే” అంటూ దేశమంతా తిరిగి దేశభక్తిని నూరిపోసిందా వీరతిలకం.

ఈ విశ్రాంతి లేని ప్రయాణాలతోనూ, ఉపన్యాసాలతోనూ ఆమె ఆరోగ్యం పాడైంది. 1919 సంవత్సరంలో పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్ జనరల్ డయ్యర్ నేతృత్వంలో హత్యా కాండ జరిగింది. ఆ సమయానికి సరోజినీనాయుడు లండన్ నగరంలో చికిత్స పొందుతోంది. ఈ విషయం ఆమె లండన్ నగరంలో విన్నది. ఆమె గుండె ఆ వార్తకు నీరయిపోయింది. అప్పటికే ఆమె గుండెజబ్బుతో ఉన్నదని బాగా ముదిరిపోయినదని చెప్పారు వైద్యులు. అయినా చనిపోయే ప్రతి భారతీయుని భయంకరమైన కేకలు ఆమె చెవుల్లో గింగురుమన్నాయి.

ఆ పరిస్థితిలో తను ఉండి కూడా ఆరోగ్యాన్ని ఏమాత్రం లెక్క చేయక క్రూరుడైన పంజాబ్ గవర్నర్ డయ్యర్ మీద ఆందోళన లేవదీసింది. గాంధీజీకి పంజాబ్ దారుణం గురించి ఉత్తరము వ్రాస్తూ, యావత్ ప్రపంచ భారతీయులకు డయ్యర్ ద్వారా జరిగిన ఘోరాన్ని వినిపించనిదే నిద్రపోననీ వారి రాక్షస కృత్యాలకు బదులుగా భారత దేశం నుంచి వారిని తరిమి కొట్టి, భారతీయుల స్వేచ్ఛ చూడనిదే, భరతమాత ఆత్మ శాంతించదని తన సందేశము ద్వారా తెలియపరిచింది. సరోజిని లండన్ నగరము నుంచి బయలుదేరి సముద్ర మార్గం గుండా ప్రయాణించి, భారతదేశములో ఓడ దిగటం తోటే శాసనధిక్కారం అమలు పరిచింది. స్వాతంత్ర్యోద్యమ చరిత్రల పుస్తకాలను అమ్మకూడదని, బ్రిటిష్ ప్రభుత్వం ఆజ్ఞలు జారీ చేసింది. ఆ ఆజ్ఞలు ఫలితంగా చాలా పుస్తకాలను అమ్మటం మానేశారు. గాంధీజీ సలహాపైన ఆ పుస్తకాలన్నింటినీ ప్రతివీధిలోనూ అమ్మి ప్రభుత్వశాసన ధిక్కారం జరిపింది సరోజినీనాయుడు.

దేశం పట్ల, ప్రజలమీద ఆమెకున్న ప్రేమ, వాత్సల్యం ఆమె సొంత ఆరోగ్య విషయం కూడా మరచిపొయ్యె విధంగా చేశాయంటే ఆమె దేశభక్తిని, త్యాగనిరతిని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలోనె ఒక బహిరంగ సభలో ఉపన్యసిస్తూ, బ్రిటిషు పాలకులు భారతదేశాన్ని తమదిగా భావించడమే అపరాధం. భారతీయుల హక్కుల గురించి భారతీయులను తమ బానిసలుగా చేసి వారి ప్రాణాలు సైతం బలి తీసుకోవటం క్షమించరాని అపరాధం” అంటూ ఆడపులిలా గర్జించింది. లండన్ కామన్స్ సభలోని భారత దేశ మంత్రి ఆమె చేస్తున్న తిరుగు బాటు ధోరణికి ఆగ్రహం చెంది ఆమె ఉపన్యాసాలు, ఉద్వేగం సక్రమమైనవి కావనీ, ఇకపై అటువంటి ప్రచారం చెయ్యవద్దనీ, బ్రిటిష్ ప్రభుత్వం ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చటట్లు చేస్తాడు. తనకే రకమైన శిక్ష విధించినా యధార్థాన్ని ప్రచారం చేయక మాననని నిర్భయంగా సమాధానం చెప్పింది సరోజినీ నాయుడు. ఒక భారత స్త్రీకి దేశంపై గల ప్రేమనూ, ఆమెకు గల స్వాతంత్ర్య పిపాసనూ అర్థం చేసుకుని అప్పటి నాయకుడైన గాంధీజీ ఆనందానికి అంతులేకుండాపోయింది. ఆయన రాజద్రోహము, నేరము క్రింద ఆరేండ్లు జైలు శిక్ష ననుభవించేందుకు వెళుతూ సరోజినీనాయుడు పై గల విశ్వాసంతో, ఉద్యమనాయకత్వం ఆమెకు అప్పగించి చేతిలో చేయి వేయుంచుకున్నాడు.

ఊరూరా, వాడవాడలా తిరుగుతు స్వాతంత్ర్య ప్రభోదం ముమ్మరంగా సాగించింది. అప్పటికే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. తన భర్త బిడ్డల యోగక్షేమాలు కూడా మాని సాటి భారతీయులను తన సొంత బిడ్డల మాదిరిగా భావింది పర్యటన సాగించిందా త్యాగమూర్తి. విరామ సమయాలలో దేశ ప్రజల భవిష్యత్ ను గురించి బ్రిటిష్ వారి ఘోర పరిపాలన గురించి రచనలు చేస్తూనె ఉంది. ఎక్కదున్నా, ఏదో ఒక రకంగా దేశ ప్రజలకు స్వాత్ర్ంత్ర్య భావాలను అందజేస్తూనే ఉంది.

దక్షిణాఫ్రికాలో భారతీయులు అనుభవిస్తున్న దుర్భర బానిసత్వాన్ని అర్థం చేసుకొని అక్కడి వారి హక్కులకోసం పోరాడేందుకు 1926 వ సంవత్సరం శ్రీమతి సరోజినీ నాయుడు దక్షిణాఫ్రికా వెళ్ళి వారికెంతో సేవ చేసింది. ఆమె దేశానికి చేసిన సేవల ఫలితంగా, ఆమెకు దేశంపై గల నిష్కళంక ప్రేమ ఫలితంగా కాన్పూరు లో 1925 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షురాలైంది “పీడిత ప్రజల విమోచనానికి జాతి, మత, కులపమైన భెదాలు ఇనిప సంకెళ్ళన్నీ, భారతీయులంతా ఒక్కటేనని, స్త్రీ పురుష భేదం లేకుండ త్యాగం చేస్తే గానీ, భరతజాతి బానిసత్వం నుంచి విమోచన పొందగలదని, అవసరమైతే ప్రాణత్యాగాలకైనా వెనుకాడడం తగదని, బానిసభావంతో తరతరాలు మ్రగ్గిపోతూ బ్రతికే కంటే త్యాగంతో ఒక తరం అంతరించినా కూడా, భావితరాలు వారికి స్వేచ్ఛను ప్రసాదించటం జాతీయ సంస్థ లక్ష్యమనీ!” మహోపన్యాసం యిచ్చి లక్షలాది ప్రజలను స్వాతంత్ర్య పిపాసులుగా తయారుచేసింది.

కెనడా, అమెరికా మొదలైన దేశాలకు 1928లో వెళ్ళి భారతీయుల బానిసత్వాన్ని గురించీ వీరి ఆశయాల గురించీ ప్రచారం చేసింది. 1929 లో తూర్పు ఆఫ్రికా అంతా ప్రచారము చేస్తూ పర్యటించింది. గాంధీజీ అరెస్టయినది మొదలు విశ్రాంతి అనే మాటకు తావివ్వకుండా దేశ, దేశాలు పర్యటిస్తూ పీడిత భారత ప్రజల విముక్తికి ఆమె ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఒక భారతీయ మహిళ చేస్తున్న ఉద్యమ ప్రచారానికి బ్రిటిష్ ప్రభుత్వం హడలిపోయింది. ఆమెను స్వేచ్ఛగా తిరగనీయడం తమకూ, తమ పరిపాలనకూ తగదని 1930 వ సంవత్సరం మే 23వ తేదీన శ్రీమతి సరోజినీ నాయుడును అరెస్టు చేసింది. అరెష్టయినందుకు గానీ, జైలు జీవితం అనుభవించేందుకు గానీ ఆమె ఏ మాత్రం భయపడలేదు. అవసరమైతె ప్రాణాలే ధార పోయాలని నిశ్చయించుకున్న దేశభక్తురాలికి ఏడెనిమిది నెలల జైలు జీవితం లెక్కలేదు. సమర్థురాలైన నాయకురాలిని. నిస్వార్థ దేశభక్తురాలిని అరెష్టు చేశారని విని గాంధీజీ ఎంతో బాధపడ్డాడు.

తను జైల్లో ఉన్నా అటువంటి ప్రచారకులు చీకటిలో ఉండటం వలన ప్రచారం ముమ్మరంగా సాగే అవకాశాలు లోపించగలవని ఆయన బాధ. భారతీయ ప్రతినిధిగా 1931 వ సంవత్సరంలో లండన్ రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్ కు వెళ్ళింది సరోజినీ నాయుడు. క్విట్ ఇండియా ఉద్యమంలో 1942 లో బ్రిటిష్ ప్రభుత్వాన్నెదిరించి ఎన్నో రకాలుగా స్వాతంత్ర్య పోరాటం సాగించిందామె. అందుకు ఫలితంగా అరెష్టు చేయబడి, దాదాపు 1945 వరకు దుర్బర కారాగారవాస జీవితం ఆనందంగా అనుభవించింది. అనారోగ్యంగా ఉన్న కారణంగా ఆమెను విడుదల చెయ్యవలసి వచ్చింది. 1947, ఆగష్టు 15 వ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. శ్రీమతి సరోజినీనాయుడు దేశానికి చేసిన సేవలు దృష్టిలో ఉంచుకుని ఈమెకు ఉత్తర ప్రదేశ్ గవర్నర్ పదవి ఇచ్చి సత్కరించడం జరిగినది. వృద్ధాప్యంలో, అనారోగ్యంతో ఉండి కూడా ఆమె ఉత్తరప్రదేశ్ కు చేసిన సేవ, కార్యదక్షత ఎన్నటికీ మరపురానివి.

శ్రీమతి సరోజినీనాయుడు తన డబ్బై వ యేట 1949 మార్చి 2 వ తేదీన లక్నోలో ప్రశాంతంగా కన్ను మూసింది. . ఈమె జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం 1964 ఫిబ్రవరి 13న ఈమె చిత్రంతో ఒక తపాలబిళ్ళను విడుదల చేసింది.

ఈమె మీద అభిమానంతో హైదరాబాదులో సికింద్రాబాద్ దగ్గర ఒక వీధికి సరోజినీ దేవి రోడ్ అని నామకరణం చేసారు. ఈమె పేరున హైదరాబాదులో సరోజినీ కంటి ఆసుపత్రీ’ని కూడా స్థాపించారు. ఈవిడగారి విలువైన వస్తువులు ఇప్పటికీ సాలార్ జంగ్ మ్యూజియంలోను, జాతీయ పురావస్తు ప్రదర్శనశాలలోనూ భద్రంగా ఉన్నాయి.

Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading