తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మారేడుమిల్లి ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. మంచి పర్యాటక స్ధలం. తూర్పు కనుమలలో ఉన్న ఈ అటవీ ప్రాంతం మారేడుమిల్లి గ్రామానికి 4 కి.మీ. దూరంలో మారేడుమిల్లి- భద్రాచం రోడ్డు నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడ కొండమీద నుండి ప్రవహించే అనేక చిన్న చిన్న జలపాతాలు చూపరులకు కనువిందు చేస్తాయి. ఇక్కడ వామూరు నది మూడుపాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఇక్కడ గడపటం ప్రకృతి ప్రేమికులకు ఓ అద్భుతమైన అనుభూతి. వెదురు బొంగులలో చేసే స్థానిక వంటకం చికెన్ ఇక్కడ పేరుపొందిన మాంసాహార వంటకం. మారేడుమిల్లి రాజమండ్రి నుండి 80 కిలోమీటర్ల దూరంలో భద్రాచలం రోడ్డు మార్గంలో కలదు. మారేడుమిల్లి లో వెదురు బొంగులలో వండే చికెన్ ఈ ప్రాంతంలో ప్రసిద్ధి. ఒక వైపు తెరచిన వెదురు గొట్టంలో కోడిముక్కలకు మసాలా, పచ్చిమిర్చి మొదలైనవి పట్టించి రెండవవైపు ఆకులతో మూసి సుమారు ఒకగంటసేపు నిప్పులమీద కాలుస్తారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఈ చికెన్ ను తప్పనిసరిగా తింటారు. పర్యాటకుల కోసం, బైసన్ పొదరిళ్ళు, కంటైనర్ కాటేజ్ లు, హిల్ టాప్ నివాసాలు (ఏసితో) అందుబాటులో ఉన్నాయి. గిరిజనులే గైడ్లు మరియు సహాయకులు. ఆన్ లైన్ లో కాటేజ్ లు బుక్ చేసుకొనే సౌకర్యం ఉండటం వలన ఆస్ట్రియా, ఫ్రాన్స్, చైనాల నుండి కూడా పర్యాటకులు వస్తారు. ఈ ప్రాజెక్టు వలన గిరిజనులు ప్రయోజనం పొందుచున్నారు.
జలతరంగణి : తూర్పుగోదావరి జిల్లాలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో దట్టమైన అటవీప్రాంతంలో ఉన్నది జలతరంగణీ జలపాతం. ఎత్తైన కొండలపైనుండి వచ్చే ఈ జలపాతం ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ జలపాతం సేలయేరులాగా ప్రవహించే దృశ్యం చూడవలసిందే. ఇక్కడకు 16 కి.మీ. దూరంలో స్వర్ణధార, అమృతధార అనే జంట జలపాతాలు కలవు. కాని వీటిని చూడాలంటే కాలినడకన వెళ్లాల్సిందే.
మారేడుమిల్లిలో వసతి సౌకర్యం కోసం ఈ క్రింది వెబ్ సైట్స్ ను చూడండి…
http://www.vanavihari.com/accomi.php?page=accomi
http://www.maruthitourism.co.in/road_Maredumilli%20(2%20days%201%20night).html