
బొబ్బలి కోట మట్టితో కట్టబడినది. బొబ్బిలి సంస్థానం 17వ శతాబ్దంలో పెద్దరాయుడుచే ఏర్పాటుచేయబడినది. బొబ్బిలి యొక్క పూర్వనామం పెద్దపులి. శ్రీకాకుళం నవాబు షేర్ మహ్మద్ ఖాన్ కు, వెంకటగిరి మహారాజవారు దక్షిణాదిలో చేసిన సేవలకు ప్రతిఫలంగా బొబ్బిలిని ఇచ్చారంటారు. పెబ్బలి, బెబ్బలిగా పిలవబడిన బొబ్బిలి తరువాత బొబ్బిలిగా స్థిరపడింది. 1750లో విజయనగరం ప్రభువు విజయరామరాజు ఫ్రెంచ్ సైన్యం సహాయంతో బొబ్బిలి రాజు రామారావు మీదకు యుద్ధానికి వస్తాడు. వీరి మధ్య జరిగిన యుద్ధం బొబ్బిలి యుద్ధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రసిద్ధి పొందినది.ఈ యుద్ధంలో ఫ్రెంచి ఫిరంగులు బొబ్బిలి కోటను బద్దలు కొట్టాయి. అయితే బొబ్బిలి వీరుల ప్రతిఘటన కారణంగా ఫ్రెంచి వారు కోటలోపలికి ప్రవేశించలేకపోయారు.ఉదయం ప్రారంభమైన యుద్ధం సాయంత్రానికి ముగిసిపోయింది.
ఫ్రెంచి వారు ఉదయం 9 గంటల ప్రాంతంలో యుద్ధానికి కొంత విరామం ప్రకటించి, ఫిరంగులను ప్రయోగించాక, మళ్ళీ కొనసాగించారు. 2 గంటలకు మరో విరామం ప్రకటించేవరకూ కూడా ఫ్రెంచి సైన్యం కోటలోకి ప్రవేశించలేకపోయింది. యుద్ధంలో చిట్టచివరి బొబ్బిలి వీరుడు కూడా నేలకొరిగాక మాత్రమే ఫ్రెంచి సైన్యం కోటలోనికి ప్రవేశించగలిగింది. లోపలికి వెళ్ళిన వారు అక్కడ మంటల్లో స్త్రీలు, పిల్లలు చనిపోయిన దృశ్యం చూసి దిగ్భ్రాంతులయ్యారు. యుద్ధం ముగిసిన మూడు రోజుల తరువాత విజయరామరాజు శిబిరం పైకి ముగ్గరు బొబ్బిలి వీరు దాడి చేస్తారు. వారిలో ఒకరు బొబ్బలిపులిగా పేరుపొందిన తాండ్రపాపారాయుడు. ఇతను విజయరామరాజును చంపివేస్తాడు. తరువాత ఇతను ఆత్మహత్య చేసుకుంటాడు. బొబ్బిలి కోటలో జరిగిన ఈ ప్రాణాహుతి తెలుగుదేశం యవత్తూ అనేక బుర్రకథలకు స్ఫూర్తినిచ్చింది.