
కూచిపూడి నృత్యము, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఒక దక్షిణ భారతీయ నాట్యం. ఇది భారతదేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన నాట్యకళ. ఈ నాట్యం కృష్ణా జిల్లాలో దివి తాలూకాకు చెందిన కూచిపూడి గ్రామములో ఆవిర్భవించింది ఇది ఆంధ్రుల సాంస్కృతిక వైభవానికి చిహ్నం. దీనిని సిద్ధేంద్ర యోగి ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చాడు. ఈ నాట్యంలో అభినయానికి, భావప్రకటనకు ప్రాధాన్యం ఇస్తారు. ఇది సంగీతపరమైన నాటకకళ.
క్రీ పూ 2వ శతాబ్దంలో ఈ ప్రాంతము లోని బ్రాహ్మణులు ఈ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించటంతో దీనికి ఈ గ్రామం పేరు మీదుగా కూచిపూడి నృత్యం అని పేరు వచ్చింది శాతవాహనులు ఈ కళను ఆరాధించి పోషించారు. దశాబ్దాలుగా ఈ నాట్య ప్రదర్శనలు వైష్ణవారాధనకే అంకితమైనాయి. అందుకే ఈ రూపాన్ని భాగవత మేళ నాటకం అంటారు. అత్యంత పవిత్ర దేవాలయమైన ఆంధ్ర విష్ణు దేవాలయం ఆవరణలో లభ్యమైన శాసనాల ప్రకారం దాదాపుగా మూడు వందల మంది దేవదాసీలు రాజమర్యాదలు అందుకునేవారు. ఇక్కడ లభ్యమైన శిల్పాలు కూడా ఆ నృత్య కళాకారిణుల దైవపూజగా భావించే అపురూప భంగిమలను సూచిస్తాయి.
చాలాకాలం వరకు,కూచిపూడి నృత్యం దేవాలయాలలో ప్రదర్శింపబడేది. సాంప్రదాయం ప్రకారం బ్రాహ్మణ కులానికి చెందిన మగవారే కూచిపూడి నృత్యాన్ని చేసేవారు. అందుకే వీరిని కూచిపూడి భాగవతులు అంటారు. 15 వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి, కూచిపూడి నాట్యంలో ఆడవారు నాట్యం చేయడానికి అనుగుణంగా, కొన్ని మార్పులు, చేర్పులు చేసి, దానిని పరిపుష్టం గావించి ఆడవారికి కూడా ఈ నృత్యంలో ప్రవేశం కల్పించాడు. అతని అనుచరులైన బ్రాహ్మణులు కూచిపూడిలో స్థిరపడి ఈ నాట్యాన్ని అభ్యసించటంతో ఆ ఊరి పేరే ఈ నాట్యానికి సిద్ధించింది. ఈ నాట్యకళ భరతుని ‘నాట్య శాస్త్రాన్ని’ అనుసరిస్తుంది.
1500 నాటికే కూచిపూడి భాగవతులు దక్షిణ భారతదేశంలో సుప్రఖ్యాతులైనట్టు మాచుపల్లి కైఫీయతులో ప్రస్తావించిన కొన్ని విషయాల వల్ల తెలుస్తోంది. 1506-09 విజయనగర చక్రవర్తి వీరనరసింహరాయలు ఎదుట కూచిపూడి భాగవతులు ప్రదర్శన చేస్తూ, సంబెట గురవరాజు అనే సామంతుడు తన పాలనలోని స్త్రీల పట్ల ధనసంపాదన కోసం చేస్తున్న అసభ్యమైన ఘోరాలు ప్రదర్శనరూపంలో తెలియపరచారని, దానిలోని వాస్తవాన్ని పరిశీలించి రాయలు సామంతుణ్ణి ఓడించి పట్టి మరణశిక్ష విధించి వధించారని కైఫీయత్తు తెలుపుతోంది.
కూచిపూడి నృత్యప్రదర్శన గణేశ స్తుతి, సరస్వతీ స్తుతి, లక్ష్మీస్తుతి, పరాశక్తి స్తోత్రాలతో మొదలవుతుంది. ఆ పై ఒక్కొక్క పాత్ర వేదిక పైకి వచ్చి స్వీయపరిచయం చేసుకొంటారు. దీని తర్వాత కథ మొదలౌతుంది. ఒక గాయకుడు, కర్ణాటక సంగీతశైలిలో కీర్తనలను పాడతాడు. దీనినే నట్టువాంగం అంటారు. ఇందులో మృదంగం, వయొలిన్, వేణువు మరియు తంబూరా వంటి వాద్యపరికరాలను ఉపయోగించబడతాయి.
చురుగ్గా లయబద్ధంగా కదిలే పాదాలు, శిల్పసదృశమైన దేహభంగిమలు, చేతులు, కళ్ళతో చేసే కదలికలు, ముఖంలో చూపించే భావాలు, ముఖాభినయంతో కూచిపూడి నృత్య కళాకారులు సాత్వికాభినయం, భావాభినయం చేయడంలో ఉద్దండులు. నృత్యకారులు ధరించే ఆభరణాలు తేలికగా ఉండే బూరుగు అనబడు చెక్కతో చేస్తారు.
కూచిపూడి భరత నాట్యానికి దగ్గరగా ఉంటుంది కానీ కూచిపూడికి ప్రత్యేక నాట్యరీతులు ఉన్నాయి.
కూచిపూడి వారి నాట్య ప్రదర్సనములు చాలా ఉన్నవి.వాని అన్నింటిని కలాపములని, భాగవత నాటకములని రెండు రకములుగా విభజింప బడినవి.
వీనిలో కలాపములు మూడు:
సత్యభామా కలాపము, గొల్ల భామా కలాపము, చోడిగాని కలాపము. కృష్ణుని సతీమణి సత్యభామను అనుకరిస్తూ చేసే నాట్యం, భామాకలాపం.
గొల్లభామాకలాపము భాణిక అను ఒక ఉషరూపకము.
ఒక వెడల్పాటి ఇత్తడి పళ్ళెం అంచులపై పాదాలను ఆనించి, రెండు చేతుల్లోనూ వెలుగుతున్న దీపాలను ఉంచుకుని తలపై నీటితో నిండిన ఒక పాత్రను నిలిపి నాట్యం చేయడాన్ని తరంగం అంటారు.
కూచిపూడి నాట్యంలో ప్రముఖులు : వేదాంతం సత్యనారాయణ, వెంపటి చినసత్యం, రాధారాజారెడ్డి, శోభానాయిడు, యామినీ కృష్ణమూర్తి. వీరే గాక అనేక వందల మంది విద్యాధికులు సైత కూచిపూడి నృత్యంలో పేరుపొందారు.
కూచిపూడి కృష్ణాజిల్లా ఘంటసాల మండలంలో ఉన్నది. విజయవాడకు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నదిమరియు చారిత్రాత్మక నగరమైన శ్రీకాకుళంకు సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నది
Raju's Resource Hub