ఉప్పు ఎక్కువైనా తక్కువైనా ఇబ్బందే.…
భారతీయులు ఉపయోగించినంత ఎక్కువగా ఉప్పు ప్రపంచంలో ఎవరూ ఉపయోగించరు. ఇదివరకటి కాలంలో ప్రజలు వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడేవారు. వారికి శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. వారు చేసే శ్రమవల్ల ఒంట్లోని ఉప్పు చెమట ద్వారా వెళ్లిపోయేది. కనుక వారికి ఉప్పు అవసరమయ్యేది.అందుకే వీరు మజ్జిగలో, పెరుగులో ఉప్పు కలుపుకుంటారు.
నేడు జీవన విధానం మారి శ్రమ తగ్గటం వలన ఉప్పును తప్పనిసరిగా తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
భారతీయులు రోజువారీ వాటకంలో పరిమితికి పదిరెట్లు అధికంగా ఉప్పు వాడుతున్నారని పరిశోధనలలో తెలిసింది. బి.పి రావాటానికి కారణం ఉప్పు అధికంగా తీసుకోవటం వలననే సూత్రీకరించారు. ఉప్పును పూర్తిగా మానివేయమని వైద్యులు చెబితేనే మానివేయాలి. సొంత నిర్ణయాలు పనికిరావు. డాక్టర్లు కూడా ఉప్పు వాడకూడదని నిర్ణయించినపుడు దానికి ప్రత్యామ్నాయంగా సైంధవలవణం వాడమంటారే కానీ పూర్తిగా మానివేయమనరు.
ఉప్పును తగిన మోతాదులో వాడితే
…… ఉప్పు శరీరాని అవసరం అది రుచిని మాత్రమే కాదు ఇతర లాభాలనూ అందిస్తుంది. శరీరంలో ద్రవపదార్ధాల స్థిరీకరణలో ఉప్పు పాత్ర ఉంది. జీర్ణ క్రియలో సహాయపడుతుంది. ఆకలిని కలిగిస్తుంది. శరీరంలోని మలినాలను తొలగించటంలో, విషపూరితమైన పదార్ధాల ప్రభావం తగ్గించటంలో ఉప్పు ఎంతగానో సహాపడుతుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరులో పాత్ర వహిస్తుంది. హార్మోన్ లు సమస్థితిలో ఉంచటంలో ఉప్పుకు పాత్ర ఉంది.
ఉప్పను అతిగా వాడటం కూడా ప్రమాదమే. అయితే ఈ ఉప్పు రోజుకు కావాల్సింది 5–10 గ్రాములు మాత్రమే. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఈ మాత్రం ఉప్పుని బయటకు పంపడానికి కిడ్నీలు 150 లీటర్ల రక్తాన్ని వడబోస్తాయి, ( శరీరంలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది, దానిని ముఫై సార్లు వడబోస్తుంది కిడ్నీ) అయితే ఒకొక్క గ్రాము ఉప్పు ఎక్కువ తీసుకున్నప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ రక్తాన్ని కిడ్నీలు వడబోయాల్సి ఉంటుంది, అందువలన కిడ్నీలు త్వరగా పాడయ్యి రక్తపీడనం అధికం అవుతుంది. రక్త పీడనం అధికం అవడం వలన రక్త నాళాలు గట్టిబడటం, చిట్లడం, పగలడం జరిగి రక్త స్రావం జరగడం తద్వారా గుండెపోటు, పక్షవాతం రావడం, ఆకస్మిక మృతి జరుగుతుంది. అందువలన అధికంగా ఉప్పు తీసుకోకూడదు. సాధారణంగా మనకు కూరలో, చారులో వేసే ఉప్పు చాలు, మళ్లీ తినేటప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఉప్పు వాడకూడదు. వంట గదిలో ఉప్పు డబ్బాలో చిన్న చెంచా పెట్టాలి. తద్వారా ఉప్పు తక్కువ పడుతుంది వంటలో. ఉప్పు మానేసి తిండి తినొద్దు.
అయోడిన్ ఉప్పును ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. కానీ సహజమైన ఆహార పదార్ధాల వలన శరీరానికి తగిన అయోడిన్ అందుతుంది. అయోడిన్ అధికమైతే థైరాయిడ్ గ్రంథి మీద ప్రభావం పడి హైపర్ థైరాయిడిజమ్ వస్తుంది. నేడు భారీ సంస్థలు ఉప్పు తయారీలో ప్రవేశించి ఉప్పును మొత్తగా, తెల్లగా వుంటే తప్పించి తినలేని విధంగా ప్రజలను ఒప్పించారు వ్యాపార ప్రకటనల ద్వారా. అయోడిన్ కలిపిన ఉప్పే ఆరోగ్యం అని నమ్మించారు. వాస్తవానికి అయోడిన్ లభించని ప్రదేశాలలో మాత్రమే అయోడైజ్డ్ ఉప్పు అవసం. కానీ అందరి చేతా దానిని తినిపించి థైరాయిండ్ ను ఇబ్బంది పెడుతున్నారు. భారతీయ ఆయుర్వేద వైద్యం సైంధవలవణం (రాక్ సాల్ట్) ఉత్తమం అంటుంది. సహజంగా తయారైన ఉప్పును తినవచ్చ. నేడు మనం తినే ఉప్పు పిత్త దోషాన్ని పెంచుతున్నదనీ, సైంధవలవణం త్రిదోషాలను సమతుల్యంలో ఉంచుతుందని, రిఫైన్డ్ ఉప్పుకన్నా సాధారణ ఉప్పే మేలన్నది వారి సలహా
నిపుణుల సలహాలు…
వంటకాలలో ఉప్పును తగ్గించి వాటి బదులు ఉల్లి, వెల్లుల్లి, నిమ్మ, ఆకుకూరలు, మసాలదినుసులు వేస్తే వాటిద్వారా శరీరానికి తగిన ఉప్పు అందుతుంది.
ఆకుకూరలు లేదా నిలవవుంచిన ఆహార పదార్ధాలు తినేప్పుడు ముందుగా వాటిని బాగా నీటిలో కడిగితే వాటికి అంటివున్న అదనపు లవణాలు, మలినాలు తొలగిపోతాయి.
ఆహారంలో భాగంగా పొటాషియం అధికంగా గల బంగాళాదుంపలు, చిలగడ దుంపలు, టమాటోలు, ఆకు కూరలు తినవచ్చు. వీటిలో ఉప్పు సహజంగా ఉంటుంది. పోటాషియం శరీరంలోకి వచ్చే సోడియం ప్రభావానికి విరుగుడుగా పనిచేసి రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
పదార్ధాలను వండే తీరును మార్చుకుని వాటిలో రుచికోసం నిమ్మరసం, కొత్తిమీర వాడుకుని ఉప్పును తగ్గించవచ్చు.