
ఈజిప్టు ఆఫ్రికా ఖండానికి చెందిన దేశం. ఈజిప్టు …..అనగానే పిరమిడ్లూ… మమ్మీలూ… అద్భుత కళాసంపద గుర్తుకు వస్తాయి. వీటిని చూడవలసిందే….. ఈజిప్షియన్లలో 90 శాతం మంది ముస్లింలు. ముఖ్య భాష అరబ్బీ. ఈజిప్టు రాజధాని కైరో. వీరి ద్రవ్యం ఈజిఫ్టియన్ పౌండ్స్.
ఈజిప్టు మొత్తం నైలునది మీదే ఆధారపడి ఉంది. ఈజిప్టును ‘నో నైల్, నో ఈజిప్ట్’ అంటుంటారు. ఎందుకంటే సంవత్సరం మొత్తంమీద కేవలం రెండున్నర సెంటీమీటర్ల వర్షం మాత్రమే కురుస్తుంది. ఎక్కడో చిన్న చిన్న పాయలుగా మొదలైన నైలు నది ఈజిప్టుకు ఓ వరం. పైనుండి వచ్చే వరదల వలన ఇక్కడ నైలునది నిండుగా ఉంటుంది. పర్యాటకపరంగా వచ్చే ఆదాయం కూడా ఈజిప్టుకు ఆదాయ వనరు. పర్యాటకులు ఎక్కువగా పురాతన స్మారక కట్టడాలు, పిరమిడ్లు, స్ఫినిక్స్ చూడాటానికి వస్తారు.ఈజిప్ట్ లో 20 దాకా వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలున్నాయి. పురాతన ఈజిప్ట్ ప్రజలు వేసిన చిత్రాలు…ఏనుగులు, హిప్పోలు, చిరుతలు మొదలగు చిత్రాలు ప్రత్యేకం. ఒకప్పుడు ఈ జంతువులు ఈజిప్ట్ లో ఉండేవి. కానీ వేటడం వలన ఈ జంతువులు ప్రస్తుతం లేవు.
ఈజిప్టులో చూడవలసినవి…
గీజా పిరమిడ్ – కైరో …
ప్రాచీన ప్రపంచ వింతల్లో ఒకటైన గీజా పిరమిడ్ రాజధాని కైరో నగరంలోనే ఉంది. రాత్రి ఏడు గంటలకు పర్యాటకుల కోసం గంటసేపు స్ఫింక్స్ స్వగతంతో సౌండ్ షో ఏర్పాటు చేయబడింది.
గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా
దీన్ని ఫారో కూఫూ క్రీ.పూ. 2560 – 2540 మధ్య నిర్మించాడు. అప్పట్లో మనిషి సృష్టించిన కట్టడాల్లోకెల్లా ఎత్తైనదిగా గీజా పిరమిడ్ పేరొందింది.
గీజా పిరమిడ్లో…
గ్రేట్ పిరమిడ్కు రెండు ద్వారాలు ఉంటాయి. ఒకటి ఫారో చక్రవర్తి కోసమైతే, రెండోది ప్రజలకోసం. సందర్శకులను ఒక ద్వారం నుంచే అనుమతిస్తారు. కింగ్స్ ఛాంబర్ లో కూఫూ తనకోసం నిర్మించుకున్న సమాధిని చూడవచ్చు. ప్రస్తుతం నాలుగు పిరమిడ్లను చూడటానికి మాత్రమే సందర్శకులకు అనుమతిస్తున్నారు. ఒక్కో పిరమిడ్ వెనక మూడు చిన్న పిరమిడ్లను రాణులకోసం నిర్మించారు.
వ్యాలీ ఆఫ్ నైల్ స్ఫింక్స్
మనిషి మొహం, సింహం శరీరం గల పౌరాణిక రూపమే స్ఫింక్స్. ఒక సున్నపురాతి కొండనే ఆ విధంగా మలిచారు. ఆ ముఖం ఫారో కాఫ్రాది అని చెబుతారు. దీన్ని క్రీ.పూ. 2613- 2494లో నిర్మించినట్లు తెలుస్తోంది.
ఈజిప్టు మ్యూజియం…
ఇందులో 1,20,000కి పైగా పురాతన వస్తువులూ 12 మమ్మీలూ ఉన్నాయి. దీన్ని 1902లో నిర్మించారు. 2011లో ఈజిప్టులో జరిగిన తిరుగుబాటులో కొన్ని విగ్రహాలనూ రెండు మమ్మీలనూ ఆందోళనకారులచే ధ్వంసం చేయబడ్డాయి. ఇందులో ప్రధానంగా చూడదగ్గది టూటన్కామెన్ మమ్మీని ఉంచిన బంగారు శవపేటిక. ఇది ప్రపంచంలోకెల్లా ఖరీదైన శవపేటికగా పేరొందింది. అప్పట్లో ఆయన ముఖానికి 14 కిలోల బంగారు తొడుగు తొడిగారు. ఆయనకోసం చేయించిన బంగారు మంచం, కుర్చీ, నగలు కూడా అక్కడ ఉన్నాయి.
ఆస్వాన్ నగరం…
ఆస్వాన్ సిటీలోని ఆనకట్టను ‘హై డ్యామ్’ అని పిలుస్తారు. ఈ నిర్మాణంవల్ల లోతట్టు ప్రాంతం ముంపునకు గురైంది. అందులో ఆస్వాన్ ఆలయం, ఫిలై ఆలయం, ఆబుసింబల్ ముఖ్యమైనవి. అయితే యునెస్కో సహకారంతో వాటిని ఎత్తైన ప్రదేశాలకు తరలించారు. ఈ చుట్టుపక్కల న్యూబియన్ అనే పురాతన తెగ ఉన్న గ్రామం కూడా ముంపునకు గురయింది. వారి భాష న్యూబియన్. దీనికి లిపి లేదు. వారికి తప్ప ఎంత ప్రయత్నించినా వేరే ఎవరూ ఆ భాష నేర్చుకోలేరంటారు
ఫిలై ఆలయం
ఇందులోని దేవత పేరు ఐసిస్. ప్రాచీన ఈజిప్షియన్లు నిర్మించిన చిట్టచివరి ఆలయం. దీన్ని వాళ్లు దేవతలుగా ఆరాధించే ఓజిరిస్, ఐసిస్లు పుట్టిన ప్రదేశంగా విశ్వసిస్తారు. కాలక్రమంలో క్రిస్టియన్లు దీన్ని చర్చిగానూ ఉపయోగించారు.
పురాతన ఈజిప్షియన్లు తాము ఆరాధించే దేవతలని మానవరూపంలో కాకుండా జంతురూపంలోనే ఎక్కువగా పూజించేవారు. అందుకే ఆలయగోడలమీద ఎద్దు, గద్ద, నక్క, మొసలి రూపంలో మలిచిన విగ్రహాలన్నీ ఆ కోవకే చెందుతాయి.
ప్రాచీన ఈజిప్షియన్లు ఒంటిరాయి స్తంభాలను నిర్మించి వాటిమీద రాజుల గురించి చెక్కించేవారు. నైలునది దక్షిణం నుంచి ఉత్తరానికి 6,853 కిలోమీటర్లు ప్రవహించి, రెండు పాయలుగా చీలి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది.
మొసళ్ల దేవత కొమాంబు ఆలయం ఈ ఆలయాన్ని మొసళ్ల దేవతకోసం నిర్మించారు. 22 మొసళ్లనూ గుడ్లనూ మమ్మీలుగా చేసి ప్రదర్శించబడుతున్నాయి.
ఆబుసింబల్ ఆలయం
గొప్ప ఫారో చక్రవర్తిగా పేరొందిన రామ్సీస్ ఖిఖి నిర్మించినదే ఆబుసింబల్ ఆలయం. ఇది రెండు ఆలయాల సముదాయం. ఒకటి రామ్సీస్ కోసమైతే, రెండోది ఆయన భార్య నెఫెర్టారికోసం. ఇది అద్భుత శిల్పకళా సంపద ఒకటే రాతితో నిర్మించిన భారీ విగ్రహాల సముదాయం.
ఎడ్ఫు ఆలయం
గద్ద ముఖం, మనిషి శరీరంతో గల హోరస్ దేవతకు చెందిన ఆలయం ఇది.ఇక్కడి ఆలయాలన్నీ ముందు భాగం వెడల్పుగానూ ఎత్తుగానూ లోపలికి వెళ్లే కొద్దీ వెడల్పూ ఎత్తూ తగ్గుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న భారీ కుడ్యాలనూ స్తంభాలను చూస్తే ఔరా అనిపించక మానదు. గోడలమీద అప్పట్లోనే ఆపరేషన్లకు అవసరమైన వస్తు సామగ్రినీ కాన్పు సమయంలో తల్లిని కూర్చోబెట్టిన దృశ్యాలనూ చూడవచ్చు.
లక్సర్ పట్టణం
ఇది ఫారోల రాజధాని నగరం. ఇక్కడ ముఖ్యంగా చూడదగ్గవి నాలుగు. మార్చురీ టెంపుల్ ఆఫ్ హాట్సెప్పట్, కార్నక్ టెంపుల్, వ్యాలీ ఆఫ్ కింగ్స్, లక్సర్ ఆలయాలు. హాట్సెప్సట్ టెంపుల్ ఓ సూర్యదేవాలయం. ఈ ప్రదేశంలో దొరికిన శిథిలాలతో దీన్ని పునర్నిర్మించారు. ఇందులోని వర్ణచిత్రాలను చూసి ఆశ్చర్యపోవాల్సిందే. వేల సంవత్సరాలు గడిచినా ఎండకు ఎండినా రంగులు మాత్రం వెలసిపోలేదు.
వ్యాలీ ఆఫ్ కింగ్స్….
ఈజిప్టుని పాలించిన ఫారో చక్రవర్తులు మరణానంతర జీవితం ఉంటుందని విశ్వసించేవారు. అందుకోసం భారీ యెత్తున నిర్మించిన పిరమిడ్లు వ్యాలీ ఆఫ్ కింగ్స్ లో చూడవచ్చు. క్రీ.పూ. 1069 నాటికి క్రమంగా సమాధులు నిర్మించటం ప్రారంభించబడింది . పిరమిడ్లలో ఉంచిన మమ్మీలనూ సంపదలనూ దుండగులు కొల్లగొడుతుండటమే దీనికి కారణం కావచ్చుంటారు. ఈ భూభాగమే సహజసిద్ధంగా ఏర్పడిన పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఫారోలు తాము జీవించి ఉండగానే తమ అభిరుచికి అనుగుణంగా తమ సమాధులని ఇక్కడ తీర్చిదిద్దుకున్నారు. వీటిలో టూటన్కామెన్ సమాధి ఒకటి. కైరో మ్యూజియంలోని మమ్మీలన్నీ ఇక్కడ బయటపడినవే. ప్రస్తుతం ఈ వ్యాలీలో కేవలం మూడింటిలోకే ప్రవేశం ఉంది. భూమిలోపలి పొరల్లో గుహలుగా తొలిచి ఇవి నిర్మించబడ్డయి.
అద్భుత కుడ్యచిత్రాలతో కూడిన టూటన్కామెన్ సమాధి అతని మమ్మీని చూడవచ్చు. ఆ సమాధిలో అనేక వస్తువులతోబాటు బంగారు తొడుగూ టూటన్కామెన్ మమ్మీ బయటపడ్డాయట. మమ్మీనీ, చెక్క శవపేటికనీ సందర్శనకు ఇక్కడ ఉంచి మిగిలిన సంపదను కైరో మ్యూజియంకు తరలించారు.
లక్సర్ ఆలయం
ఇది 66 ఎకరాల్లో నిర్మించిన 132 భారీ స్తంభాల సముదాయం. ఇక్కడ రహదారికి ఇరువైపులా మానవశరీరం పొట్టేలు ముఖం కలిగిన విగ్రహాలున్నాయి.
ఈజిప్ట్ లో ఇంకా చూడవలసినవి :
Alexandria, Siwa Oasis, Westeran Sahara Desert, Karnak Temple Complex, Temple Philae, Temple of Sobek NS Horus Nile River Cruises