ఇంటిపనీ వంటపనీ చేసేసరికి ఎక్కడలేని నిస్సత్తువ ఆవరిస్తుంది. ఉద్యోగినుల సంగతి అయితే అసలే చెప్ప నక్కర్లేదు. ఇలాంటప్పుడు కాసిని డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు తింటే సరి. ఇవి ఒంట్లోని శక్తి స్థాయుల్ని పెంచుతాయట. ఈ పండులో కనీసం 102 కెలారీల శక్తి ఉంటుందట. అలాగని బరువు పెరుగుతామనే భయం అస్సలు అక్కర్లేదు. ఎందుకంటే దీనిలో కొవ్వులు చాలా మితంగానే లభిస్తాయి మరి. డ్రాగన్ ఫ్రూట్లో పొట్ట ఆరోగ్యానికి తోడ్పడే ప్రొట యాటిక్స్ పుష్కలం ఇవి జీర్ణసమస్యల్ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక, ఇందులోని యాంటీ అక్సిడెంట్లు రోగనిరోధకతను పెంచుతాయి. ముఖ్యంగా ఫ్రీరాడికల్స్ పోరాడి కాన్సర్ కణాల్ని అడ్డుకుంటాయి.
ఈ పండులో ఇనుము, ఫోలేట్, విటమిన్ బి దొరుకు తాయి. ఇవి మహిళల్ని రక్తహీనత బారిన పడకుండా చేస్తాయి. ముఖ్యంగా గర్భధారణ సమయంలో తల్లీబి డ్డల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇక, ఇందులోని మెగ్నీ షియం ఒత్తిడిని అదుపులో ఉంచుతుంది. మంచి నిద్రను అందిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. * బీటా-సానిన్, ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్, ఆస్కార్బిక్ యాసిడ్లు… డ్రాగన్ పండులో ఉంటాయి. ఇవి డయా బెటిక్ రోగుల పోషక అవసరాలను తీరుస్తాయి. ఒంట్లోని చక్కెర స్థాయుల్ని తగ్గిస్తాయి.

ఇది ముళ్లజెముడు (కాక్టస్) జాతికి చెందిన చెట్టు. మధ్య అమెరికా, దక్షిణ అమెరికా అడవుల్లో పుట్టింది. లాటిన్ అమెరికాలో ఈ పండును ‘పితాయ’ లేదా ‘పితాహాయ’ అని కూడా పిలుస్తారు. లాటిన్ అమెరికానుంచీ వచ్చిన ఈ పండ్లను ఆగ్నేయాసియా దేశాలైనా థాయ్లాండ్, వియత్నాంలలో చాలాకాలంగా పెంచుతున్నారు. ఈ పండ్లలో కూడా కివీ పండ్ల మాదిరిగానే చిన్న చిన్న నల్లని గింజలు ఉంటాయి.
ప్రపంచవ్యాప్తంగా వియత్నాం డ్రాగన్ ఫ్రూట్ల ఉత్పత్తిలో ముందుంది. ఈ పండ్ల ఎగుమతిలో కూడా వియత్నాందే పైచేయి. 19వ శతాబ్దంలో ఫ్రెంచ్ వలసదారులతో పాటు ఈ పండు వియత్నాంలోకి ప్రవేశించింది. ఆ దేశంలో దీన్ని ‘థాన్ లాంగ్’ అని పిలుస్తారు. అంటే డ్రాగన్ కళ్లు అని అర్థం.
చైనా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, శ్రీలంకలలో కూడా ఈ పండ్లను విరివిగా పండిస్తున్నారు. భారతదేశంలో 1990లనుంచీ వీటి పెంపకం ప్రారంభమైంది. గత కొన్నేళ్లుగా దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఈ పండ్ల తోటల పెంపకం పెరిగింది. సాంప్రదాయ పంటలకు బదులుగా కచ్, సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్లోని పలు ప్రాంతాల్లో రైతులు డ్రాగన్ పండ్ల తోటలవైపు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. గుజరాత్తోపాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలో కూడా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. గుజరాత్లోని అనేకమంది రైతులు ఈ పండ్ల పెంపకం గురించి తెలుసుకోవడం కోసం పూణె వెళుతుంటారు. ఇంటర్నెట్లో కూడా విస్తారమైన సమాచారం లభ్యమవుతోంది.

ఈ పండ్ల లోపలి భాగం రెండు రకాలుగా ఎరుపు, తెలుపు రంగుల్లో ఉంటుంది. ఎరుపు పండ్లకు డిమాండ్ ఎక్కువ. అయితే, భారతదేశంలో అనేకమంది దీన్ని స్థానిక ఫలంగానే భావిస్తున్నారు. డెంగ్యూ వచ్చిన రోగులలో ప్లేట్లెట్లు పడిపోయినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తినడం మంచిదని చెబుతారు.
