చీరమేను/సీరమేను/చీరమీను అనేది చిన్న చేప, చాకురొయ్యల కన్నా చాలా చిన్నగా, చూడగానే ఏదో సేమ్యాల్లా కనబడతాయి. ఇవి గోదావరిలో వరదల తర్వాత దసరా నుంచి దీపావళి మధ్యలో మాత్రమే దొరుకుతాయి. ఈ చేపలు వేళ్ళ సందుల్లో నుంచీ వలల్లోనుంచీ కూడా జారిపోయేంత చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని చీరలతో పట్టుకుంటారు. అందుకే ఈ చేపకి చీరమీను అని పేరు.

మా గోదారోళ్లకు పులస తరువాత అంతటి ప్రీతి పాత్రమైనది చీరమేను..( తమిళ పేరు సిరు మీను లేదా చీరతో పట్టుకుంటారు కాబట్టి చీర మేను అయిందో తెలియదు). ఇది అక్టోబర్, నవంబర్ నెలలలో శీతాకాలం ప్రారంభం సమయంలో గోదావరి నదీ ముఖ ద్వారం వద్ద అంటే గోదావరి (తీపినీరు), సముద్రం (ఉప్పునీరు) కలిసే ప్రదేశాల్లో దొరుకుతుంది. దీపావళికి ముందు ఖచ్చితంగా దొరుకుతుంది.. మూడు రోజులనుంచి యానాం గోదావరి లో చాలా ఎక్కువగా పడుతుంది. అంగుళం సైజులో ఉండే చీరమేను చేపలను వలతో పట్టడం సాధ్యం కాదు కాబట్టి దీనిని చీరల సహాయంతో గోదావరి ముఖ ద్వారాల్లో మత్స్యకారులు పడుతుంటారు.
ఇది ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సమృద్ధిగా ఉన్న లిజార్డ్ ఫిష్ జాతికి చెందినదిగా చెబుతారు. సముద్రం, నదీ కలిసే ప్రదేశం వద్ద చల్లగా వీచే తూర్పుగాలులకు నీటి అడుగుభాగంలో ఉన్న చీర మేను కాస్తా నీటి పైకి వస్తుంటుంది. గుంపులు, గుంపులుగా అధిక సంఖ్యలో వచ్చిన చీరమేను చిన్నదిగా ఉండటంతో వలలను కాకుండా మత్స్యకారులు చీరలను ఉపయోగించి పట్టుకుని దానిని ఒడ్డుకు చేరుస్తుంటారు. చీరలతో పట్టడం వల్లే దీనికి చీరమేను అనే పేరు వచ్చింది. యానాం, భైరవపాలెం తదితర ప్రాంతాల్లో చీరమేను ఎక్కువగా లభిస్తుంది. పులస చేపల తరువాత అంత డిమాండ్ ఉన్నది చీర మేను

దీనిని మిగతా చేపల్లాగ పులుసు, కూర చేయరు. చింతకాయల తొక్కుతో పాటు వేయించి, ఆ తర్వాత వీటితో కూర కానీ వేపుడు కానీ వండుతారు. అలాగే మినప్పిండితో పాటు వీటిని కలిపి చీరమీను గారెలు కూడా వేసుకుంటారు. వీటి సీౙన్ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడో ఉన్న చూట్టాలు కూడా ఎగురుకుంటూ వచ్చేస్తారు ఈ కూరని వండించు తినటానికి. అలాగే అమెరికా, ఫ్రాన్స్ దేశాలకు కూడా వీటిని అప్పుడప్పుడు ఎగుమతి చేస్తుంటారు.

వీటిని యానాం, ముమ్మిడివరం చేపల మార్కెట్లలో బక్కెట్లలో, బిందెల్లో పోసి అమ్ముతారు. చీరమేనును సోల, సేరు, తవ్వ, గ్లాసు, బకెట్ కొలతల్లో అమ్ముతుంటారు. అంగుళం సైజులో ఉండే చీరమేను చేపలను వలతో పట్టడం సాధ్యం కాదు కాబట్టి దీనిని చీరల సహాయం తో గోదావరి ముఖ ద్వారాల్లో, మత్సకారులు పడుతుంటారు. ముఖ్యంగా శీతాకాలం ప్రారంభ సమయమైన అక్టోబర్, నవంబర్ నెలల్లో చీరమేను ఎక్కువగా దొరుకుతుందని మత్సకారులు తెలిపారు. ఇంతకీ వీటి ధర ఎంతుంటుందో ఊహించగలరా? అరకిలో దాదాపు వెయ్యి రూపాయలు వరకూ ఉంటుంది. అంటే కిలో చేపల ధర రెండు వేలు. ఒకవేళ ఆ సంవత్సరం చేపల పట్టుబడి తక్కువుంటే కనుక వీటి ధర కిలో నాలుగు వేల వరకూ కూడా ఉంటుంది. బిందెడు చీరమీను పన్నెండు వేల వరకూ ఉంటుంది.