ఈ రోజుల్లో మొబైల్, ఏసీ, టీవీ.. ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్కు అయినా చిన్న చిన్న సమస్యలు వస్తే చాలామంది కొత్తవి కొనేసుకుంటున్నారు. పాడైనవి, పాతవి ఇంట్లో ఏదో ఒక మూలకు చేరిపోతున్నాయి. యూరప్ లో ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం సగటున ఒక్కో ఇంటిలో 74 ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నట్లుగా వెల్లడైంది. వాటిలో పాత హెడ్ఫోన్లు, రిమోట్లు, గడియారాలు, ఐరన్బాక్సులు, హార్డ్ డ్రైవ్లు, కీ బోర్డులు, మౌస్లు, మొబైళ్లే ఎక్కువ. భారత్లోనూ గత ఐదేళ్లలో ఈ-వ్యర్థాలు 72.47% పెరిగినట్లు అంచనా. పాడైన, మనం వాడకుండా వదిలేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై విక్రయించుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలియకపోవడమూ దీనికి ఒక కారణం.
ఇదిగో ఇలా విక్రయించొచ్చు…!
ఫ్లిప్కార్ట్లో ఏదైనా వస్తువు అమ్మకానికి పెట్టినప్పుడు సంస్థ మొదట ధరను నిర్ణయిస్తుంది. సంస్థ ప్రతినిధులు వచ్చి వస్తువును పరిశీలించి కొనుగోలు చేస్తారు. వస్తువు నాణ్యత ఆధారంగా ధర నిర్ణయిస్తారు. ఫోన్లు, ట్యాబ్లు, టీవీలు, ఫ్రిజ్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు విక్రయించొచ్చు. ‘క్యాషిఫై’ ద్వారా కూడా ఫోన్లు, ట్యాబ్లు, స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ వాచ్లు, టీవీలు, ఐమాక్లు, కెమెరాలు, ఏసీలు విక్రయించొచ్చు. వీటి మోడల్ ఆధారంగా పోర్టల్ ఆటోమెటిక్గా నిర్ణయిస్తుంది. సంస్థ ప్రతినిధులు పరీక్షించినపుడు లోపాలున్నట్లయితే ధర తగ్గించి కొనుగోలు చేస్తారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఎక్స్ఛేంజ్లో పాత వస్తువులు పెట్టి కొత్త వస్తువుల కొనుగోలులో ధర తగ్గించుకోవచ్చు. ఆన్లైన్లో ఓఎల్ఎక్స్, క్వికర్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో పాత వస్తువుల ధరలను మనమే నిర్ణయించి అప్లోడ్ చేయొచ్చు. ఆసక్తిగల వారు వచ్చి ధర నిర్ణయించి తీసుకెళ్లే వెసులుబాటు ఈ సంస్థలు కల్పిస్తున్నాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మొబైల్ను అమ్మాలనుకుంటే అందులో వ్యక్తిగత సమాచారాన్ని పూర్తిగా తొలగించాలి. ఇందుకోసం ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. ‘ఫైన్డ్ మై ఫోన్ ఆప్షన్’ డిజెబుల్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి. గుర్తుతెలియని వ్యక్తులకు, సంస్థలకు విక్రయిస్తే సైబర్ నేరగాళ్లకు చేరే ప్రమాదముంది.
Raju's Resource Hub
