📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

సర్ ఆర్థర్ కాటన్ జీవితం – కృషి

Google ad

కాటన్ దొర’ అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (మే 15, 1803 – జూలై 24, 1899) బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు.

సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం

నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః, స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం’

ఇదీ నేటికీ గోదావరి వాసులు నిత్యం స్మరించే శ్లోకం. అపర భగీరుథుడైన ఆంగ్లేయ ఇంజినీర్ సర్ ఆర్థర్ కాటన్ కారణంగా తాము నిత్యం ఉదయాన్నే గోదావరి స్నానమాచరించే భాగ్యం కలిగిందన్నది దాని సారాంశం.

Google ad
‘గోదావరి’ గుండెల్లో చిరంజీవి.. కాటన్ దొర
 
‘కాటన్ దొర’ అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (మే 15, 1803 – జూలై 24, 1899) బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 18 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాస్‌లో ఉద్యోగంలో చేరారు. అప్పటి బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ ఈయనను దక్షిణ ప్రాంత చెరువుల శాఖకు ఇంజనీర్‌గా నియమించింది. ఆయన నిరంతరం ప్రజల సంక్షేమం, సేవ కోసమే పరితపించేవారు.
 
ధవళేశ్వరం ఆనకట్ట
 
18వ శతాబ్దంలో పవిత్ర జీవనదికి ఇరువైపుల ఉన్న ఉభయగోదావరి జిల్లాలు అతివృష్టి , వరద ముంపు, అనావృష్టి , కరువుకాటకాలతో విలవిలలాడాయి. 1833లో అనావృష్టి వల్ల కలిగిన కరువుతో రెడు లక్షల ప్రజలు తుడిచుపెట్టుకు పోయారు. అలాగే 1839లో ఉప్పెన, కరువు మరింతమందిని పొట్టనపెట్టుకొంది. దీంతో గోదావరి నది నీటికి అడ్డుకట్ట కట్ట వేయాలని కాటన్ అనుకున్నారు. తన ఆలోచనలను నిజం చేస్తూ జలాశయం నిర్మించారు.

సముద్ర మట్టానికి 1600 అడుగుల ఎత్తున నిర్మించాలని ప్రతిపాదించిన జలాశయాన్ని, కొన్ని నదుల అనుసంధానాన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం అనుమతించలేదు. దాన్ని ప్రభుత్వం వ్యతిరేకించడానికి కారణం.. వాటివలన కలిగే ఇబ్బందులు కాదు. పెట్టుబడి ఎంత?.. వచ్చే రాబడి, కట్టాల్సిన వడ్డీ ఎంత?.. అంటూ లెక్కలు వేయటం. బ్రిటీష్ ప్రభుత్వ వాదనను కాటన్‌ వ్యతిరేకించారు. పాలితుల సుఖాలు, ప్రాణాలు కరువుతో ముడిపడి ఉన్నాయని, పాలకులు ధర్మంగా, బాధ్యతగా కరువు నివారణ పనులు చేపట్టాలని పోరాటం జరిపారు.
 
ఫలితంగా గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట రూపొందింది. 1847 – 52 మధ్య కాలంలో గోదావరిపై తూర్పగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేశారు. దీంతో క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కలకలలాడింది. తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఈ మహత్కర్యాన్ని ఆయన కేవలం అయిదేళ్లలో పూర్తి చేయడం గమనార్హం. కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఆనకట్ట, ఉభయగోదావరి జిల్లాలలోని రైతుల ఆర్థిక, జీవనగతులను మార్చేసింది. తమపాలిట దుఖఃదాయినిగా ఉన్న గోదావరిని, ప్రాణహితగా మార్చిన భగీరథుడుగా కాటన్ దొర ఈ రెండు జిల్లాల ప్రజలగుండెల్లో నిలచిపోయాడు.
 

ధవళేశ్వరం ఆనకట్ట

ధవళేశ్వరం ఆనకట్టతో దశ మారింది..

కరువు పీడిత ప్రాంతం గోదావరి డెల్టాగా రూపాంతరం చెందడంలో ధవళేశ్వరం వద్ద నిర్మించిన ఆనకట్ట ప్రధాన పాత్ర పోషించింది. అప్పటి జిల్లా అధికారిగా ఉన్న సర్ హెన్రి మౌంట్ పంపించిన నివేదిక ఆధారంగా ఆనకట్ట నిర్మాణం ఆలోచన తెరమీదకు వచ్చింది. ఆర్థర్ కాటన్ అనే ఇంజనీరుకి ఆ ప్రతిపాదన అప్పగించి, సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని బ్రిటీష్ ప్రభుత్వం అప్పగించడంతో ఆయన అందుకు అనువైన ప్రాంతం కోసం సుదీర్ఘ అన్వేషణ చేశారు.

Google ad

తొలుత పాపికొండలకి ఎగువన ఉన్న కోయిదా ప్రాంతాన్ని పరిశీలించినప్పటికీ నీటి లభ్యత కారణంగా ఆయన శబరికి దిగువన పాపికొండలు ప్రాంతంలో కూడా ఆనకట్టి నిర్మాణం ప్రతిపాదించినట్టు రికార్డుల్లో ఉందని ఇరిగేషన్ రిటైర్డ్ ఇంజనీర్ విప్పర్తి వేణుగోపాల్ బీబీసీతో చెప్పారు.

Google ad
Google ad

పాపికొండలు ప్రాంతంలో గోదావరి కేవలం 200మీ.ల వెడల్పున ఉండడంతో, చివరికి ధవళేశ్వరం, విజ్జేశ్వరము మధ్య నది వెడల్పుగా ఉండటం గమనించి ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు తెలిపారు.

‘‘సమీపంలో ఉన్న లంకలు, ఇసుక తిన్నెల మూలంగా ఆనకట్ట నిర్మాణం కోసం నీటిని మళ్లించడం సులువుగా ఉంటుందని కాటన్ భావించారు. ఈ మేరకు కాటన్ రూపొందించిన నివేదికను అప్పటి మద్రాసు గవర్నరు మార్కస్ ట్వేల్ డేల్ ఆమోదించారు. లండన్‌లోని బోర్డు ఆఫ్ డైరెక్టర్ల ఆమోదానికి పంపించారు. ప్రాజెక్టు రిపోర్టును పరిశీలించిన తర్వాత, 1846 ధవళేశ్వరం వద్ద గోదావరిపై ఆనకట్టని కాటన్ ఆధ్యర్యంలో నిర్మించేందుకు లండన్ నుంచి అనుమతి వచ్చింది’’ అని వివరించారు.

గోదావరి జిల్లాల్లో గోదారమ్మ పరవళ్లు, పచ్చని పంట పొలాలు

సకాలంలో ఆనకట్ట నిర్మాణం, ప్రారంభం

ధవళేశ్వరం వద్ద ప్రస్తుతమున్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్‌కి పూర్వరూపంగా ఆనకట్ట ఉండేది. అనేక వరదల తాకిడికి ఆనకట్ట దెబ్బతినడంతో చివరకు 1970వ దశకంలో కొత్తగా బ్యారేజ్ నిర్మాణం చేశారు.

1978లో ప్రస్తుతం అందరూ చూస్తున్న బ్యారేజ్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పటికీ బ్యారేజ్ సమీపంలో ఉన్న ఆనకట్ట ఆనవాళ్లు నాటి కట్టడాల నిర్మాణ నాణ్యతకు తార్కాణంగా చెప్పవచ్చు.

1847 ఏప్రిల్ నెలలో ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాటన్ పర్యవేక్షణలో ఈ ఆనకట్టను వేగంగా పూర్తి చేశారు. ఐదేళ్లలోనే నిర్మాణం జరగడంతో 1852 నాటికి అందుబాటులోకి వచ్చింది.

తొలుత 9 అడుగుల నిర్మాణం పూర్తయిన దశలో వచ్చిన వరదలతో కొంత నష్టం జరిగినా, మళ్లీ పట్టుదలతో సకాలంలో ఆనకట్టను రూపొందించడంలో కాటన్ కృషి ఎంతో ఉందని నీటి పారుదల రంగ నిపుణులు అంగీకరిస్తారు.

అప్పట్లో ప్రధాన రవాణా సాధణంగా పడవ ప్రయాణాలు ఉండేవి. వాటికి అనువుగా ఉండాలని, అదనంగా సాగునీటి అవసరాలు తీర్చవచ్చని 1862-67 మధ్య ఆనకట్ట ఎత్తు రెండు అడుగుల మేర పెంచినట్లు ధవళేశ్వరం ఆనకట్ట రికార్డులు చెబుతున్నాయి.

మళ్లీ 1897-99 లలో సిమెంటు కాంక్రీటు వినియోగించి మరో తొమ్మిది అంగుళాల ఎత్తు పెంచారు. 1936లో మూడు అడుగుల చొప్పున ఎత్తు ఉండే తలుపులు అమర్చి ,పదిలక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం ప్రారంభమయ్యింది.

తెలుగు ఇంజనీర్లు తోడుగా ఇసుక గట్టుతో మొదలెట్టి..

ధవళేశ్వరం వద్ద గోదావరి సుమారుగా 6 కి.మీ. వెడల్పు ఉంటుంది. అందులో మూడోవంతు భాగం లంకలుంటాయి. వాటిని ఉపయోగించుకుని నీటిని మళ్ళించడానికి మొదట ఇసుకతో గట్లు నిర్మించారు.

ఆనకట్ట నిర్మాణంలో పది వేలమంది కూలీలతో పాటుగా ఐదు వందల మంది వడ్రంగులు, ఐదు వందల మంది కమ్మరులను వినియోగించారు. 1847 అగస్టు మూడో వారంలో రైల్వే వ్యాగన్ల ద్వారా ఉక్కు, రాయిని ధవళేశ్వరానికి తరలించారు. దాంతో యంత్రసామాగ్రితో నిర్మాణపు పనులు ముమ్మరమయ్యాయి.

నది ఒడ్డుకు చేర్చిన రాళ్లు, ఇతర సామగ్రిని పడవలద్వారా నదిలోని నిర్మాణ ప్రాంతానికి రవాణా చేసేవారు. ఇందుకు 25 టన్నుల భారం మోయగల 18 నావలను వినియోగించినట్టు నరిశెట్టి ఇన్నయ్య తన పుస్తకంలో పేర్కొన్నారు. రోజుకు దాదాపు 150 టన్నుల రాయిని నదీగర్భంలో నిర్మాణస్థలానికి తీసుకెళ్లేవారని రాశారు.

నదిలో 1847 వరదల నాటికి ఇసుక గట్లన్నీ రాళ్లతో పటిష్టం చేయడంతో పనులు వేగవంతం అయ్యేందుకు దోహదపడిందని వివరించారు. నాటి కట్టడాలు కొంత మేరకు నేటికీ ధృఢంగా నిలవడం గమనిస్తే ఆనాటి పటిష్టత అర్థమవుతుంది.

ఆ ప్రక్రియలో కాటన్‌కి కూలీలతో పాటుగా ఇంజనీర్లయిన భారతీయులు కూడా కొందరు తోడుగా ఉన్నారు. అందులొ తొలి నాటి ఇంజనీర్లలో ఒకరిగా చెప్పుకున్న రాజ్ బహుదూర్ వీణం వీరన్న కూడా ఉన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్‌లో సబ్ ఇంజనీర్‌గా ఆయన పనిచేశారు. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో సహాయకుడిగా ఉన్నారు.

గోదావరి కాల్వ

కాలువల నిర్మాణం కాటన్ దూరదృష్టికి తార్కాణం

1803లో జన్మించిన ఆర్థర్ కాటన్ 15 ఏళ్ల వయసులో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంజనీరింగు సర్వీసుల్లో చేరి శిక్షణ పొందారు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్‌గా నియమితుడైన ఆయన విధి నిర్వహణలో భాగంగా‌ 18 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాస్‌లో ఉద్యోగిగా పనిచేశారు.

అక్కడి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ తరుఫున దక్షిణ భారత చెరువుల శాఖకు ఇంజనీర్‌గా నియమితులయ్యారు. ఆ సమయంలో 1828-29 మధ్య కాలంలో కావేరీ నది వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేశారు.

1840లోనే కృష్ణా నదిపై ఆనకట్ట నిర్మాణ సాధ్యాసాధ్యాలపై ఆయన ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం పూర్తి చేసిన తర్వాత 1852 గన్నవరం అక్విడక్టు పనులు కూడా కాటన్ ప్రారంభించారు.

అన్నింటికీ మించి గోదావరి జిల్లాలో కాలువల నిర్మాణం కోసం ఆయన చేసిన పరిశోధన, కార్యాచరణ నేడు ఆ ప్రాంతం సశ్యశ్యామలంగా మారేందుకు దోహదపడిందన్నది నీటి పారుదల రంగ నిపుణుల అభిప్రాయం.

‘‘కాటన్ అనేక ఆటంకాలు ఎదుర్కొన్నారు. ఆయన ప్రతిపాదనలకు పలు అభ్యంతరాలు వచ్చాయి. అయినా పట్టుదలగా ప్రయత్నించి, నాటి బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఒప్పించారు. గోదావరి డెల్టాలో ప్రతీ మారుమూలకు సాగునీరు చేరేందుకు అనువుగా చేసిన కాలువల నిర్మాణంపై అతి పెద్ద విజయానికి కారణం. కాలువలు, వాటికి సమాంతరంగా మురుగు నీటి వ్యవస్థకు ఆయన రూపకల్పన చేశారు. ప్రధాన కాలువలు, వాటి నుంచి పిల్ల కాలువలు, పంట కాలువల వ్యవస్థను సమర్థవంతంగా తీర్చిదిద్దారు. అందుకే అతివృష్టి, అనావృష్టితో తల్లడిల్లిన ప్రాంతంలో స్థిరమైన వ్యవసాయక అభివృద్ధికి అవకాశం దక్కింది. అందుకు కాటన్ మహానీయుడికి గోదావరి గడ్డ రుణపడి ఉంటుంది’’ అని మాజీ ఎస్‌ఈ వేణుగోపాల్ బీబీసీతో అన్నారు.

ధవళేశ్వరం ఆనకట్ట, కాటన్, గోదావరి

అర్థ శతాబ్దం పాటు భారత్‌లోనే విధులు

1818లో చిన్న వయసులోనే భారత్‌కు వచ్చిన ఆర్థర్ కాటన్ 1860లో పదవీ విరమణ చేసి స్వదేశానికి వెళ్లిపోయారు. అప్పుడే ఆయనకు బ్రిటీష్ ప్రభుత్వం సర్ బిరుదు కూడా ప్రదానం చేసింది.

1863లో మరోసారి భారత దేశానికి వచ్చి, సోన్ లోయలో పలు నీటిపారుదల ప్రాజెక్టులకు ఆయన సలహాలిచ్చారు. చివరకు 96 సం.ల వయసులో 1899 జూలై 24 నాడు ఆయన వృధ్యాప్యంతో మరణించారు.

ఆర్థర్ కాటన్ మరణించి 121 సంవత్సరాలు గడిచినా నేటికీ భారతీయుల్లో ఆయనకు గుర్తింపు తగ్గలేదంటే ఆయన ప్రణాళికలు, చేసిన శ్రమ, వాటి ఫలితాలు అర్థం చేసుకోవచ్చని అనేక మంది చెబుతుంటారు.

ఆంధ్రప్రదేశ్‌లో అనేక కొలమానాలను పరిశీలిస్తే అభివృద్ధి పరంగా గోదావరి, కృష్ణా తీరం ముందు ఉండడంలో కాటన్ శ్రమ ఉందని భావిస్తారు. తొలిదశలో వ్యవసాయక అభివృద్ధి, ఆ తర్వాత పారిశ్రామికంగా ముందడుగు, ప్రస్తుతం ఆక్వా జోన్ గా ఈ ప్రాంతం ముందంజలో ఉండడానికి నాటి ఆనకట్ట నిర్మాణమే మూలమలుపు అని దాదాపుగా అంతా అంగీకరిస్తారు.

ధవళేశ్వరం ఆనకట్ట, కాటన్, గోదావరి

కడియం నర్సరీలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందంటే ఆయనే కారణం..

కాటన్ బ్యారేజ్ దిగువన కడియం సమీపంలో విస్తరించిన వేల ఎకరాల నర్సరీలు అంతర్జాతీయ కీర్తిని గడించాయి. ప్రపంచమంతటికీ మొక్కలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాయి.

1850వ దశకంలో ధవళేశ్వరం ఆనకట్ట అందుబాటులోకి వచ్చిన తర్వాత గోదావరి తీరం వివిధ రంగాల్లో అడుగుపెట్టింది. తణుకు, కాకినాడ తీర ప్రాంతం వంటివి పారిశ్రామిక పురోగతిని సాధించాయి.

20వ శతాబ్దం తొలినాళ్లలోనే ఆయా ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధి ఛాయలు కనిపించాయంటే ప్రధాన కారణం ధవళేశ్వరం ఆనకట్టేనని చెప్పవచ్చు. విస్తారంగా పంటలు, తద్వారా రవాణా సదుపాయాలు కూడా గోదావరి జల ప్రవాహం ద్వారా లభించాయి.

కోనసీమ కొబ్బరి సాగుతో కళకళలాడడంలోనూ గోదావరి నదీ ప్రవాహం, దానిని పొలాలకు మళ్లించిన కాటన్ కృషి కీలకమైనవిగా చెప్పవచ్చు. అదే సమయంలో 1910 ప్రాంతంలో కడియంలో మొక్కల పెంపకం మొదలుకావడం ఆ తర్వాత అది వేగంగా విస్తరించడంతో ప్రస్తుతం సమీపంలోని మూడు నాలుగు మండలాల్లో నర్సరీ రంగం ప్రధానంగా మారింది.

‘‘అప్పట్లో పంటలు పండించడానికే నీరు లేక వర్షాధారంగా ఉన్న నేల ఇది. ఇప్పుడు విస్తారంగా వివిధ వెరైటీల మొక్కలు పండించే స్థాయికి చేరింది. అందుకే కడియం నర్సరీలో కీర్తిలో కాటన్‌దే ముఖ్యపాత్ర, ఆయన రాకముందు కరువులో తిండి లేక ఒండ్రుమట్టితో కడుపు నింపుకున్న రోజులున్నాయని మా పూర్వీకులు చెప్పేవారు. కానీ ఇప్పుడు అందరికీ కడుపు నింపే ప్రాంతంగా మారింది. అందుకే మేము ఆయన్ని పూజిస్తాం. ఆరాధిస్తాం. ఫల, పుష్పాలతో నిత్యం కీర్తిస్తాం’’ అంటూ కడియపులంక కి చెందిన సత్యదేవ నర్సరీ యజమాని పుల్లా సత్యన్నారాయణ బీబీసీకి తెలిపారు.

ధవళేశ్వరం ఆనకట్ట, కాటన్, గోదావరి

కాటన్ స్మృతులు నేటికీ మ్యూజియంలో పదిలం…

ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణంలో కాటన్ వినియోగించిన సామాగ్రి నేటికీ మ్యూజియంలో పదిలంగా ఉంది. ఆయన ఆనవాళ్లు, వినియోగించిన వస్తువులను అందులో పొందుపరిచారు.

ప్రస్తుతం కరోనా కారణంగా మూతపడినప్పటికీ నిత్యం ఈ మ్యూజియంని వందల మంది సందర్శిస్తారు. దేశ విదేశాల నుంచి మ్యూజియం సందర్శనకు వస్తూ ఉంటారని ధవళేశ్వరం ఇరిగేషన్ ఈఈ బీబీసీతో చెప్పారు.

సమీపంలోని బొమ్మూరులో కాటన్ నివాస గృహం సైతం పదిలంగా ఉంది. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో 2010లో ఓసారి కాటన్ గృహాన్ని ఆధునీకరించారు.

ఉభయ గోదావరి జిల్లాలలోని చాలా గ్రామాల్లో ఇతరదేశ నాయకుల విగ్రహాలున్నా, లేకపోయినా తప్పనిసరిగా కన్పించే విగ్రహం గుర్రం మీద స్వారీచేస్తున్న కాటన్ దొర. బ్రిటీషు వారు మనదేశాన్ని వదిలిపెట్టి పోయినా.. ధవళేశ్వరం బ్యారేజి నిర్మించి 150 ఏళ్లు గడిచినా గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో కాటన్ దొర ఇంకా చిరంజీవిగా ఉన్నారంటే ఆ కృషి ఎలాంటిదో అర్థమవుతోంది.

Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading