వేసవిలో డీహైడ్రేషన్‌ కి మంచినీళ్లతో ఇలా చెక్ పెట్టండి..

వేసవి మొదలైపోయింది. నిన్న మొన్నటి వరకూ హాయిగా తాకిన చల్లగాలులు క్రమంగా వేడి పుంజుకుంటున్నాయి. తరచూ పెదాలు ఎండిపోవడం, నాలుక తడారిపోవడం వాతావరణంలో వేడి పెరిగేకొద్దీ తీవ్రమౌతాయి. కేవలం మంచినీళ్లతో ఈ సమస్యను అధిగమించడం కష్టం. కానీ ఆ మంచినీటినే మరింత శక్తిమంతంగా తయారుచేసుకుంటే డీహైడ్రేషన్ సమస్యను సులభంగా అధిగమించవచ్చు. మరి అదెలా అంటారా..? ఇదిగో ఇలా..

కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, తులసి, పుదీనా లాంటి ప్రత్యేకమైన ఆకులు నీటిలో వేయడం వల్ల వాటిలోని యాంటీ ఆక్సిడెంట్‌లు, ఖనిజాలు నీటిని మరింత శక్తిమంతంగా తయారుచేస్తాయి. ఇవి డీహైడ్రేషన్ నుంచి కాపాడటమే కాకుండా శరీరంలోని మలినాలనూ తొలగిస్తాయి.

* సన్నగా గుండ్రంగా తరిగిన కీరా ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, కొన్ని పుదీనా లేదా తులసి ఆకులు నీటిలో వేయాలి. మంచినీటికి బదులుగా వీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ దరిచేరదు. అంతేకాదు నిమ్మకాయలోని ఎలక్ట్రొలైట్లు శరీరానికి శక్తినిచ్చి రోజంతా ఉత్సాహంగా ఉండడానికి తోడ్పడతాయి.

* గుప్పెడు వట్టి వేరును శుభ్రంచేసి, ఒక నెట్‌క్లాత్‌లో వదులుగా దిండులా కట్టి మంచినీటిలో వేయాలి. లేదా నేరుగా నీటిలో వేసి, వట్టి వేరు నీటి అడుగుకు చేరగానే పైన తేరిన నీటిని మంచినీళ్ల బదులుగా తాగితే శరీరంలోని వేడి తగ్గుతుంది. ఇది మంచి స్ట్రెస్ బస్టర్‌గానూ ఉపయోగపడుతుంది.

* లీటరు నీటికి అర కప్పు చొప్పున పుచ్చకాయ ముక్కలని వేయాలి. వీలుంటే ఇందులో నాలుగు కీరా ముక్కలు, కొన్ని పుదీనా ఆకులు చేర్చాలి. మండే ఎండల్లో సైతం ఇది మీ శరీరాన్ని చల్లబరుస్తుంది.

* ముక్కలుగా చేసిన స్ట్రాబెర్రీ, గుండ్రంగా తరిగిన నారింజ నీళ్లలో వేసి మంచినీటికి బదులుగా తాగితే డీహైడ్రేషన్ తగ్గడమే కాకుండా శరీరానికి పుష్కలంగా సి విటమిన్ లభిస్తుంది. రక్తంలోని మలినాలు తొలగిపోయి చర్మం కాంతిమంతంగా తయారౌతుంది.

* గులాబీ రేకులను నీటిలో వేసి మంచి నీళ్లకు బదులుగా వీటిని తాగితే శరీరంలోని అధిక వేడిమి అదుపులోకి వస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఇలా రోజుకో కొత్త పద్ధతిలో రుచికరంగా నీటిని తయారుచేసుకుని ఈ వేసవిని చల్లగా గడిపేయండి మరి..!

%d bloggers like this:
Available for Amazon Prime