హిందువుల పండుగల్లో మహాశివరాత్రి ముఖ్యమైనది. ఈ పండుగ మాఘమాసం కృష్ణపక్షంలో అర్థరాత్రి ఉండే చతుర్దశి తిథినాడు వస్తుంది. చతుర్దశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైంది. అందులోనూ కృష్ణచతుర్దశి అంటే అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి తిథి మరీ ప్రీతికరమైంది. ఆ కారణంగానే ప్రతి మాసంలోనూ వచ్చే కృష్ణచతుర్దశి తిథులు మహాశివరాత్రులుగా ఉంటాయి. సంవత్సరంలోని పన్నెండు శివరాత్రులలో మాఘమాసంలో వచ్చే శివరాత్రి శివుడికి బాగా ఇష్టమైంది కాబట్టి దాన్ని మహాశివరాత్రి అని అంటారు.
ఏడాదికొకసారి వచ్చే మహాశివరాత్రినాడు శివపూజ చేయడం పుణ్యప్రదం. యోగి అయినవాడు తన యోగబలం చేత యోగనిద్రలోకి వెళ్లే రాత్రిని యోగశివరాత్రి అని అంటారు. సాధారణంగా రాత్రిపూట దేవీపూజను, పగటిపూట దేవపూజను చేయడం ఒక ఆచారంగా ఉంటుంది. కానీ శివరాత్రి విషయంలో మాత్రం ఇది భిన్నంగా కనిపిస్తుంది. శివరాత్రి రోజున రాత్రిపూటే శివపూజ జరుగుతుంది. త్రిమూర్తులలో మూడోవాడు శివుడు. బ్రహ్మ సృష్టికర్త. విష్ణువు సంరక్షకుడు. శివుడు లయకారకుడు. ఇలా శివ ఆరాధన రాత్రిపూట జరగడానికి ఓ కారణం కూడా ఉంది.
ఉపవాసం రోజు ఏం చేయాలి

మహా శివరాత్రి పర్వదినం నాడు భక్తులు ఉపవాసం, జాగరణ చేస్తుంటారు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ‘ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను’ అని సంకల్పం చెప్పుకోవాలి. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతునివైపు మనసును తిప్పడం కష్టం. ఉపవాసం ఉండేవారు ఆరోగ్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు పాటించడం మంచిది. దీని కోసం ఏం చేయాలనే దాని గురించి వైద్య నిపుణులు పలు సూచనలు ఇచ్చారు.
ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక…
► రోజులో 6 సార్లు ఒక్కోసారి ఒక్కో సలాడ్ కప్పు పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది.

► పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువ. బొప్పాయిలో విటమిన్లు అధికం. అందుకని పుచ్చకాయ, బొప్పాయి సలాడ్ తీసుకోవాలి.

► పచ్చికొబ్బరి కోరి సలాడ్లో కలిపి తీసుకోవచ్చు. వీటికి కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి యాడ్ చేసుకోవచ్చు.

► గ్లాసుడు పాలు, అరటిపండు కలిపి మిల్క్ షేక్ చేసుకొని తాగితే పోషకాలు సమృద్ధిగా శరీరానికి అందుతాయి.
► ఆరుసార్లు తీసుకుంటే మంచిది. ఆకలి వేస్తున్న ఇదీ ఉండదు. ఆరోగ్యంపై దెబ్బ పడదు.

►పాలు ఇష్టపడని వారు పలచటి మజ్జిగ తీసుకోవచ్చు. కండరాలు బలహీనం కాకుండా ఉంటాయి.

► జాగరణ చేసేవాళ్లు సాయంకాలం కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే తగినంత శక్తి లభిస్తుంది.
► పూజలలో పూర్తి శ్రద్ధ పెట్టాలంటే శరీర స్థితిని కూడా గమనించుకోవాలి. అప్పుడే ఉపవాస దీక్ష మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది.
పూర్వం ఓసారి ప్రళయం వచ్చినప్పుడు అంతా కటికచీకటిగా మారిపోయింది. ఆ సమయంలో లోక కల్యాణం కోసం పార్వతీదేవి శివుడిని గురించి తపస్సు చేసింది. ఆనాటి పార్వతి తపస్సు మెచ్చిన శివుడు ఆ చీకటిని పోగొట్టి మళ్లీ మామూలుగా రాత్రి, పగలు ఏర్పడేలా చేశాడు. దాంతో జీవులన్నీ మళ్లీ ఆనందించాయి. తాను చేసినట్లుగా అంత రాత్రివేళ శివుడిని గురించి పూజలు చేసినవారికి సర్వసుఖాలు కలిగేలా అనుగ్రహించమని పార్వతీదేవి శివుడిని ప్రార్థించింది. శివుడు అందుకు అంగీకరించాడు. పార్వతి చేసిన శివపూజకు గుర్తుగా ఆనాటి నుంచి మహాశివరాత్రి పూజా పర్వదినం ఏర్పడింది.
ఈశాన సంహిత ప్రకారం శివుడు ఓసారి అర్థరాత్రి సమయంలో తేజోలింగంగా ఆవిర్భవించాడు. అదే లింగోద్భవకాలం. అలా పరమశివుడు లింగాకారంలో పుట్టినరోజు కావడంచేత శివుడికి ఇష్టమైన ఆ రోజున శివపూజ జరపడం మంచిదని శైవం చెబుతోంది. వినాయక చవితి, శ్రీరామనవమి లాంటి పండుగలలో దేవుళ్లను పగటిపూట పూజిస్తారు. శివరాత్రినాడు శివుడిని రాత్రిపూట మాత్రమే పూజించడం, మిగిలిన పండుగలలా పంచభక్ష్య పరమాన్నాలతో కాక ఉపవాస దీక్షతో శివరాత్రి పండుగను జరుపుకోవడం ఓ విశేషం.
శివుడు అభిషేక ప్రియుడు. అలాగే బిల్వదళ ప్రియుడు. అందుకే అభిషేకాలు, బిల్వార్చనలను శివరాత్రినాడు విధిగా చేస్తుంటారు. తెలిసైనా, తెలియకైనా కొన్ని నీళ్ళు శివలింగం మీద పోసి మరికొన్ని మారేడు దళాలు ఆ శివలింగంమీద పెడితే బోళాశంకరుడు పరవశించి అలా చేసినవారిని అనుగ్రహించిన కథలు ఎన్నెన్నో మన పురాణాల్లో కనిపిస్తున్నాయి.
You must log in to post a comment.