
ఏటా ఈ కోట మీద భారత ప్రధానమంత్రి స్వాతంత్ర్య దినోత్సవం రోజున త్రివర్ణ పతాకం ఎగురవేస్తారు. 1649లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఎర్రకోటను నిర్మించారు. ఎర్రకోట కేంద్రంగా దిల్లీ నగరం ఏడుసార్లు నిర్మితమైంది. మొఘల్ సామ్రాజ్య వైభవానికి, పతనానికి ఈ ఎర్రకోట సాక్షీభూతంగా నిలిచింది.
ప్రేమ, అనురాగం, ద్వేషం, ద్రోహం, రాజకీయ కుట్రలు, అంతర్గత కుమ్ములాటలకు ఎర్రకోట వేదిక. చక్రవర్తుల వైభవాన్నే కాదు, పతనాన్నీ ఇది చూసింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన 1857 తిరుగుబాటుకు కూడా ఎర్రకోటే కేంద్రం.
1628వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక రోజున ఆగ్రాలోని తన సింహాసనం మీద ఆలోచిస్తూ కూర్చున్నషాజహాన్.. ఆగ్రా కోట చాలా చిన్నగా ఉందని భావించారు. ఆగ్రా, లాహోర్ కోటలకన్నా పెద్ద కోటను దిల్లీలోని యమునా తీరంలో నిర్మించాలని ఆయన నిర్ణయించారు’’ అని తన పుస్తకం ‘సిటీ ఆఫ్ మై హార్ట్’లో రాణా సాఫ్వీ పేర్కొన్నారు. తన ప్రియసఖి ముంతాజ్ మరణించిన తర్వాత షాజహాన్కు ఆగ్రా కోట మీద విరక్తి కలిగిందని కొందరు అంటారు. ‘‘హిందూ ఆచారులు, ముస్లిం హకీమ్ల సలహా మేరకు ఫిరోజ్షా కోట్ల, సలీంగఢ్ మధ్య ప్రాంతాన్ని కోట నిర్మాణ ప్రాంతంగా ఎంపిక చేశారు’’ అని షాజహాన్ ఆత్మకథ ‘పాదుషా నామా’ను ఉటంకిస్తూ సాఫ్వీ రాశారు.
ఎర్రకోట నిర్మాణానికి 1639 ఏప్రిల్ 29న షాజహాన్ ఆదేశాలు జారీ చేశారు. అదే సంవత్సరం మే 12న కోటకు శంకుస్థాపన జరిగింది. ఫతేపూర్ సిక్రీలో ఉన్న ఎర్రరాతిని నదీ మార్గంగుండా కోట ప్రాంతానికి తరలించి నిర్మించారు. ఎరుపు రంగు రాతితో కట్టింది కాబట్టే దానికి ఎర్రకోట అనే పేరు వచ్చింది.

కోటలోని దివాన్-ఈ-ఆమ్లో చక్రవర్తి సామాన్యుల సమస్యలు వింటారు. దివాన్-ఈ-ఖాస్లో మంత్రులు, సామంత రాజులతో చక్రవర్తి సమావేశమవుతారు.

చివరి మొఘల్ పాలకుడు
1837లో రెండో బహదూర్ షా మొఘలు సామ్రాజ్య పాలకుడయ్యారు. తన పూర్వీకులలాగానే ఆయన జరోఖా దర్శన్ నిర్వహించేవారు. దేశంలోని ముస్లింలు, హిందువులు ఆయన్ను గౌరవించేవారు. అయితే ఆయన తన తుది వరకు బ్రిటీష్ వారు నియమించిన ఖిల్లేదార్ ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడటంకన్నా మరేమీ చేయలేక పోయారు. 1857 ఏప్రిల్లో బ్రిటిష్ సైన్యంలో పని చేస్తున్న సైనికుడు మంగళ్ పాండే, బ్రిటిష్ వారిపై బెంగాల్ లోని బారక్ పూర్ ప్రాంతంలో తిరుగుబాటు చేశారు.
దీని ప్రభావం మేరఠ్ మీదుగా దిల్లీ వరకు చేరింది. సిపాయిల తిరుగుబాటు ఎర్రకోట వరకు పాకి కొందరు బ్రిటీష్ సైనికాధికారులు, వారి కుటుంబీకుల హత్యకు దారి తీసింది. మే నెలలో జరిగిన ఘర్షణల సందర్భంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి బహదూర్ షా మద్దతు పలికారు. అయితే దీనికి నాయకత్వం వహించడానికి మాత్రం ఆయన అంగీకరించ లేదు.
ఆ తర్వాత ఝాన్సీ, అవధ్, కాన్పూర్, బిహార్, బెంగాల్ ప్రాంతాలలో కూడా తిరుగుబాట్లు జరిగాయి. కానీ సరైన సమన్వయం, నాయకత్వం లేకపోవడంతో ఈ తిరుగుబాటు విఫలమైంది. నాలుగు నెలల తర్వాత బ్రిటీషర్లు ఎర్రకోట మీద తిరిగి పట్టుసాధించగలిగారు. ఈ ఘటనల తర్వాత బ్రిటీష్ సైనికుల్లో ఆగ్రహం మరింత పెరిగింది. వారు సమీపంలోని ప్రాంతాలపై దాడులు, లూటీలు చేయడం ప్రారంభించారు. బ్రిటిష్ వారి ఒత్తిడితో చాలామంది దిల్లీ విడిచి వెళ్లాల్సి వచ్చింది. అందులో బహదూర్ షా ఒకరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారని, తమ నాయకత్వంపై తిరుగుబాటు చేశారని, క్రైస్తవులను హత్య చేశారని బహదూర్ షాపై బ్రిటిష్ పాలకులు ఆరోపణలు చేశారు. దివాన్-ఈ-లో విచారణ జరిగింది. ఆయన్ను రంగూన్ ( ప్రస్తుత యాంగూన్- మయన్మార్) ప్రవాసం పంపారు. ఆయన సంతానాన్ని హత్య చేశారు.
You must log in to post a comment.