
కరోనావైరస్కు కళ్లెం వేయడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా తొలి దశ టీకాల కార్యక్రమాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ( 16-01-2021) వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించారు.
దేశ వ్యాప్తంగా 3,006 కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ కేంద్రాలన్నింటినీ వర్చువల్గా అనుసంధానించారు. తొలి రోజు శనివారం ఒక్కో కేంద్రంలో వంద మందికిపైగా టీకాలు తీసుకోనున్నారు. ఈ వ్యాక్సినేషన్ను ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమంగా అభివర్ణిస్తున్నారు.

‘దేశమంతా ఎదురుచూసిన రోజు ఇది’
వ్యాక్సినేషన్ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
”ఈ రోజు కోసం మనం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాం. వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? అని ప్రశ్న ఎప్పటినుంచో మనల్ని తొలచేస్తుండేది. ఇప్పడు టీకా వచ్చేసింది. చాలా తక్కువ సమయంలోనే పరిశోధకులు టీకాను అభివృద్ధి చేశారు. దీని కోసం రాత్రి, పగలు తేడా లేకుండా పరిశోధకులు కష్టపడ్డారు” అని మోదీ అన్నారు.

”ఒకటి కాదు.. రెండు మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సీన్లను పరిశోధకులు సిద్ధం చేశారు. కరోనావైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉండేవారికి మొదట ఈ వ్యాక్సీన్లు ఇస్తాం. వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి మొదట వ్యాక్సీన్లు ఇస్తాం. వైద్య సిబ్బంది ప్రైవేటులో ఉన్నా.. ప్రభుత్వంలో పనిచేస్తున్నా.. అందరికీ ఈ వ్యాక్సీన్ ఇస్తాం” అని మోదీ స్పష్టం చేశారు.

‘చరిత్ర సృష్టిస్తున్నాం’
”చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ఎప్పుడూ టీకాలు వేయలేదు. 3 కోట్ల కంటే తక్కువ జనాభా ఉండే దేశాలు వందకుపైనే ఉన్నాయి. కానీ భారత్ తొలి దశలోనే మూడు కోట్ల మందికి టీకాలు వేస్తోంది. రెండో దశలో ఈ సంఖ్యను 30 కోట్లకు తీసుకెళ్తాం. తొలి డోసు టీకా తీసుకున్న తర్వాత మాస్క్ పెట్టుకోకపోవడం, సామాజిక దూరం పాటించకపోవడం లాంటి తప్పులు చేయొద్దు. ఎందుకంటే రెండో డోసు టీకా తీసుకున్న తర్వాతే పూర్తి రక్షణ లభిస్తుంది. వ్యాక్సీన్ రెండు డోసులు పూర్తిగా వేసుకోవడం చాలా ముఖ్యం. రెండు డోసుల మధ్య ఒక నెల రోజుల వ్యవధి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు” అని మోదీ చెప్పారు.
మోదీ భావోద్వేగం
”ఈ కరోనావైరస్ మనుషుల మధ్య దూరాన్ని పెంచింది. పిల్లల్ని దూరం చేసుకొని తల్లులు ఏడ్చారు. ఆసుపత్రుల్లో చేర్పించిన వృద్ధులను కలవలేకపోయాం. కరోనాతో మరణించిన వారికి సరిగా అంతిమ వీడ్కోలు కూడా చెప్పలేకపోయాం’ అన్నారు ప్రధాని. కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఆరోగ్య సేవల సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్ల ఇబ్బందుల గురించి మాట్లాడుతూ మోదీ భావోద్వేగానికి గురయ్యారు.
‘దేశ మంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయి’
మోదీ తన ప్రసంగంలో తెలుగు కవి గురజాడ అప్పారావు కవితను చదివారు. ‘సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడుపడవోయి.. దేశమంటే మట్టి కాదోయి.. దేశమంటే మనుషులోయి’’ అని గురజాడ చెప్పిన మాటలను మోదీ గుర్తు చేశారు.
You must log in to post a comment.