
కేరళ రాష్ట్ర చేప ‘కరిమీన్’కు మంచి కాలం వచ్చింది. ఈ చేప చర్మంపై గుండ్రటి చుక్కలు మాదిరిగా ఉండి కాంతులీనుతూ ఉంటాయి. అందుకే దీన్ని ఆంగ్లంలో పెర్ల్ స్పాట్ ఫిష్’ అని పిలుస్తూ ఉంటారు. దీని పేరు మన కొర్రమీను మాదిరిగా, రూపం చందువా మాదిరిగా ఉంటుంది. కరిమీన్ అత్యంత రుచికరమైన చేప. దీనితో చేసిన వంటకాలను కేరళీయులతోపాటు పర్యాటకులు లొట్టలేసుకుంటూ తింటారు. కిలో రూ. 500–600 దాకా పలుకుతుంది. విదేశాల్లోనూ గిరాకీ ఉంది.
కేరళలో నదులు, వంకలు సముద్రంలో కలిసే అలెప్పీ తదితర ప్రాంతాల్లో ఈ చేపలు సహజసిద్ధంగా మత్స్యకారుల వలలకు పడుతూ ఉంటాయి. పశ్చిమ దిశగా పారే కర్ణాటక నదుల్లో, ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతాల్లో కూడా కరిమీన్ కనిపిస్తూ ఉంటుంది. కేరళ బ్యాక్వాటర్స్లో స్థానికులు కరిమీన్ పిల్లలను పట్టుకొని, వాటిని కొందరు రైతులు చెరువుల్లో పెంచుతూ ఉంటారు. నీటిలో పెరిగే నాచు, మొక్కలు, కీటకాలను తిని కరిమీన్ పెరుగుతుంది. కరిమీన్ పిల్లలకు చాలా గిరాకీ ఉంది కాబట్టి, ఈ చేప పిల్లల కోసం చాలా మంది జల్లెడపడుతూ ఉంటారు. కాలక్రమంలో ఈ చేపల జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహక సంస్థ (ఎంపెడా) రంగంలోకి దిగింది. కరిమీన్ చేప పిల్లల ఉత్పత్తిని ప్రారంభించింది.